సుశాంత్‌ కేసు: పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

30 Jul, 2020 16:08 IST|Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ కేసులు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్‌ ఆత్మహత్య కేసును ప్రస్తుతం పోలీసులు విచారించవచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు బదిలీ చేయాలన్న పిటిషన్‌ను కొట్టి వేస్తూ గురువారం అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. పోలీసులను తమ పని తమను చేయనివ్వాలని, తమకేదైనా స్పష్టమైన సందేహం ఉంటే ముంబై హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌ అల్కా ప్రియకు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది.  (దిల్‌ బేచారా: ఎంత మంది చూశారంటే!)

అలాగే అభిమానులు, కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ సుశాంత్ కేసును సీబీఐకు అప్పగించలేమని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముంబైలో దర్యాప్తు జరుగుతుండగా సుశాంత్‌ తండ్రి రియాపై పట్నాలో ఫిర్యాదు చేయడంతో బిహార్‌ పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. తన కొడుకును మోసం చేసి రియా డబ్బులు లాక్కుందని, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందని సుశాంత్‌ తండ్రి తన ఫిర్యాదు‌లో ఆరోపించారు. (సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు)

 

కాగా రియా ఈ కేసును ముంబైకి బదిలీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కేసు విచారణను బీహార్ నుంచి ముంబైకి ట్రాన్సఫర్ చేయాలనీ.. రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే  ముంబైలో దర్యాప్తు జరుగుతుండగా అదే కేసులో బీహార్‌లో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం చట్టవిరుద్ధమని రియా న్యాయవాది చెప్పారు. అంతేగాక స్వయంగా హోమంత్రి అమిత్‌షాకు ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆమె కోరారు. మరోవైపు రియా చర్యను అడ్డుకోవాలని కోరుతూ సుశాంత్‌ తండ్రి ఈ రోజు(గురువారం) సుప్రీంకోర్టులో కోవియట్‌ పిటిషన్‌ వేశారు. కాగా సుశాంత్‌ జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే అతన్ని ఆత‍్మహత్యకు ప్రేరేపించారన్న నేపథ్యంలో ముంబై పోలీసులు ఇప్పటికే 40 మందికి పైగా ప్రశ్నించారు. (ఆత్మహత్య చేసుకున్న మరో నటుడు)

మరిన్ని వార్తలు