Suriya Jai Bhim: పార్వతి అమ్మాళ్‌కు సూర్య రూ. 10 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌

15 Nov, 2021 13:39 IST|Sakshi

తమిళ స్టార్‌ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళ హీరో అయినప్పటికీ ఆయనకు తెలుగులోనూ ఎంతో క్రేజ్‌ ఉంది. ఒక పక్క కమర్షియల్ సినిమాలతో పాటు నటనకి ప్రాధాన్యం, కథ బలం ఉన్న సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా సూర్య జస్టిస్ చంద్రు అనే అడ్వకేట్‌ బయోపిక్‌తో అద్భుతమైన విజయం సాధించాడు. నిజ జీవితంలో అన్యాయంగా జైలుపాలైన భర్తను కాపాడుకునేందుకు ఓ గిరిజన మహిళ చేసిన పోరాటంలో.. చంద్రూ అనే అడ్వకేట్ నిస్వార్థంగా ఆమెకు సాయం చేసి తన తరపున కోర్టులో వాదించి గెలిచిన ఓ కేసును స్ఫూర్తిగా తీసుకుని ‘జై భీమ్’ సినిమాను చేశాడు సూర్య.

చదవండి: ష‌ణ్ముఖ్‌, సిరిలపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన జెస్సీ.. అరియాన షాక్‌

ఈ సినిమాతో ఇందులోని రియల్ పాత్రలు కూడా ప్రపంచానికి పరిచయమయ్యాయి . సినిమాలో సినతల్లి పాత్రకి నిజ జీవితంలో పార్వతి అమ్మాళ్ అనే మహిళ స్ఫూర్తి. ప్రస్తుతం ఆమె ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. పిల్లలు పోషించలేక, వృద్ధాప్యంతో చాలా కష్టాల్లో ఉంది. ఈ సినిమాతో తన గురించి బయటి ప్రపంచానికి తెలియడంతో హీరో, కొరియోగ్రఫర్‌ రాఘవ లారెన్స్ ఆమెకు సొంత ఇల్లు కటిస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో సూర్య సైతం పార్వతి అమ్మాళ్‌కు అండగా నిలిచాడు. తన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేసి.. మొత్తంపై నెల నెలా వచ్చే వడ్డీ పార్వతి అమ్మాళ్‌కు చేరేలా చేశాడు.

చదవండి: అందంతో కట్టిపడేస్తోన్న అవికా, ఫొటోలు వైరల్‌

అంతేగాక తన తదనంతరం ఆమె పిల్లలకు ఈ వడ్డీ అందజేస్తామని సూర్య తెలిపారు. ఇప్పటికే అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సేవలు చేస్తున్నాడు. ఎంతో మంది పిల్లల్ని చదివిస్తున్నాడు. ఎన్నో సేవా కార్యక్రమాల్ని చేపడుతున్నాడు. ఇవి మాత్రమే కాక తరచూ విరాళలు ప్రకటిస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటాడు. కరోనా సమయంలో కూడా తనవంతుగా కోటీ రూపాయలు ప్రకటించి తమిళ నాడు ప్రభుత్వానికి అండగా నిలిచాడు. అంతేగాక జై భీమ్‌ చిత్రం స్ఫూర్తితో గిరిజనుల సంక్షేమం కోసం కూడా సూర్య కోటీ రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా సూర్య రీల్‌ హీరోగా మాత్రమే కాకుండా రియల్‌ హీరో అనిపించుకుంటున్నాడు. 

చదవండి: కేబీఆర్‌ పార్క్‌ వద్ద నటిపై దాడి.. ముఖంపై పిడిగుద్దులు, హత్యాయత్నం

మరిన్ని వార్తలు