పరాక్రమవంతుడు

17 Apr, 2023 04:20 IST|Sakshi

సూర్య, దిశా పటానీ జంటగా, యోగిబాబు కీలక పాత్రలో శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌లతో కలిసి జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘కంగువ’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాని రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ టీజర్‌ను విడుదల చేశారు. డైరెక్టర్‌ శివ మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో సూర్య గంభీరంగా కనిపిస్తారు. ‘కంగువ’ మాకు ఎంతో ప్రత్యేకమైన చిత్రం.

షూటింగ్‌ను పూర్తి చేసి, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘త్రీడీలో పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యేలా కామన్‌ టైటిల్‌ పెట్టాల్సి వచ్చింది. అందుకే అన్ని భాషల్లో ‘కంగువ’ టైటిల్‌ను ఫిక్స్‌ చేశాం. కంగువ అంటే అగ్నిశక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు అనే అర్థాలు వస్తాయి. ఈ సినిమా షూటింగ్‌ 50 శాతం పూర్తయ్యింది. మరో నెలలో బ్యాలన్స్ షూటింగ్‌ పూర్తి చేస్తాం. గ్రాఫిక్స్‌ వర్క్‌ ఎక్కువగా చేయాల్సి ఉంది.. దీంతో పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌కు ఎక్కువ సమయం పడుతుంది. అందుకే 2024 ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నాం’’అని చిత్రయూనిట్‌ పేర్కొంది. 

మరిన్ని వార్తలు