సుశాంత్‌ తండ్రి ఫిర్యాదు.. రియాపై కేసు నమోదు

28 Jul, 2020 18:44 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ యువనటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్‌ మృతిపై ఆయన తండ్రి కేకే సింగ్‌ పోలీసులను ఆశ్రయించారు. సుశాంత్‌ స్నేహితురాలు రియా చక్రవర్తిపైన పట్నాలోని రాజేంద్రనగర్‌ పోలీసుల స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రియాతోపాటు మరికొందరు స్నేహితులు మోసం, కుట్రకు పాల్పడటం ద్వారా సుశాంత్‌ ఆత్మహత్యకు కారణమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేకే సింగ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు రియాతో పాటు, మరో ఐదుగురి మీద పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా నలుగురు పోలీసులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఈ కేసుపై విచారణ జరిపేందుకు ముంబైకి పంపారు. ఇన్ని రోజులుగా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి విమర్శలు చేయని.. సుశాంత్‌ కుటుంబం ఇప్పుడు రియాపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ముంబై పోలీసులు ఈ కేసు విచారణ జరుపుతున్న తీరుపై కుటుంబ సభ్యులు అసంతృప్తితో ఉన్నట్టుగా సమాచారం.  (లవ్‌ యూ.. ఇక్కడికి వచ్చెయ్‌.. సరే అక్కా!)

మరోవైపు రియా చక్రవర్తి కూడా సుశాంత్‌ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ఆమె సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి కూడా చేశారు. అంతేకాకుండా సుశాంత్‌తో తన జ్ఙాపకాలను పలుమార్లు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కాగా, సుశాంత్‌ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన ఆత్మహత్యకు బాలీవుడ్‌లో నెలకొన్న బంధుప్రీతి కారణమనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని చాలా మంది డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ మేరకు పలువురు బాలీవుడ్‌ ప్రముఖులను, సుశాంత్‌ సన్నిహితులను విచారిస్తున్నారు. (‘మరోసారి నా హృదయం ముక్కలైంది’)

మరిన్ని వార్తలు