Sushant Singh Rajput Death Case: సుశాంత్‌ది హత్యే.. డెడ్‌బాడీపై గాయాలు..: పోస్ట్‌మార్టమ్‌ సిబ్బంది

26 Dec, 2022 17:20 IST|Sakshi

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించి రెండేళ్లుపైనే అయింది. అతడిని బాలీవుడ్‌ పొట్టనపెట్టుకుందని ఎందరో శాపనార్థాలు పెట్టారు. అసలు ఆయనది ఆత్మహత్య కాదని హత్యేనని ఇప్పటికీ వాదించేవాళ్లు ఉన్నారు. తాజాగా కూపర్‌ ఆస్పత్రి సిబ్బంది సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యేనని ముందుకు రావడం సంచలనంగా మారింది. పోస్ట్‌ మార్టమ్‌ చేసేటప్పుడు అతడి శరీరంపై గాయాలున్నాయని చెప్పడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సుశాంత్‌ సింగ్‌ పోస్ట్‌మార్టమ్‌కు హాజరైన సిబ్బంది రూప్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్‌ చనిపోయినరోజు మా ఆస్పత్రికి ఐదు శవాలు వచ్చాయి. అందులో ఒకరైన సుశాంత్‌ శరీరానికి పోస్ట్‌మార్టమ్‌ చేసేందుకు మేము వెళ్లాము. అప్పుడాయన శరీరంపై, మెడపై గాయాలు కనిపించాయి. పోస్ట్‌మార్టమ్‌ ప్రక్రియను వీడియో తీయాల్సింది కానీ అధికారులు కేవలం ఫోటోలు మాత్రమే తీయండని చెప్పారు. దీంతో వారి ఆదేశాల ప్రకారం ఫోటోలు మాత్రమే తీసి పంపాము.

కానీ సుశాంత్‌ డెడ్‌బాడీ మొదటిసారి చూసినప్పుడే అది ఆత్మహత్య కాదని, హత్యేనని అర్థమైంది. కానీ అధికారులు వెంటనే ఫోటోలు తీసి డెడ్‌బాడీని పోలీసులకు అప్పజెప్పాలని ఆదేశించడంతో ఆ రాత్రే పోస్ట్‌మార్టమ్‌ కంప్లీట్‌ చేశాం అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సుశాంత్‌ మరణంపై చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో ట్విటర్‌లో #SushantSinghRajput హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. కాగా సుశాంత్‌ సింగ్‌ 2020 జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడాడు.

చదవండి: ఈ ఏడాది చివరివారంలో రిలీజవుతున్న సినిమాలు
అవతార్‌ 2 సెన్సేషన్‌.. వేల కోట్ల వసూళ్లు ఆగడం లేదుగా

మరిన్ని వార్తలు