రియాను దారుణంగా వేధిస్తున్నారు: స్వరా భాస్కర్‌

27 Aug, 2020 11:22 IST|Sakshi

మీడియాపై విరుచుకుపడిన నటి.. సిగ్గుపడాలంటూ ఆగ్రహం

బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్‌‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుశాంత్‌ ప్రేమికురాలు రియా చక్రవర్తికి సంబంధించి మీడియాలో రోజు ఏదో ఒక వార్త ప్రచారం అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నటి స్వరా భాస్కర్‌ రియాకు మద్దతుగా నిలిచారు. మీడియా మంత్రగత్తెను వేటాడే విధంగా రియాను వేధిస్తుందని విమర్శించారు. ఉగ్రవాది కసబ్‌ విషయంలో కూడా ఇంత దారుణంగా ప్రవర్తించలేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు స్వరా ట్వీట్‌ చేశారు. ‘కసబ్‌ విషయంలో కూడా మీడియా ఇలా ప్రవర్తించలేదు. కానీ రియా చక్రవర్తి విషయంలో మాత్రం దారుణంగా ప్రవర్తిస్తోంది. ఆమెకు సంబంధించిన విషపూరిత కథనాలతో ప్రజలను రెచ్చగొడుతుంది. భారతీయ మీడియాతో పాటు ఇలాంటి విషపూరిత కథనాలను ప్రొత్సాహిస్తున్నందుకు మనం కూడా సిగ్గు పడాలి’ అంటూ స్వరా ట్వీట్‌ చేశారు. (చదవండి: ‘సుశాంత్‌కు తెలియకుండా డ్రగ్స్‌ ఇచ్చారు’)

నిషేధిత మాదక ద్రవ్యాల వ్యవహారంలో పాత్ర ఉందనే ఆరోపణలపై బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తిపై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ రియా చక్రవర్తి తన కుమారిడికి విషం ఇచ్చి చంపేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి సీబీఐ సుశాంత్‌ సింగ్‌ స్నేహితుడు సిద్ధార్ధ్‌ పితానీని ప్రశ్నించింది. 

మరిన్ని వార్తలు