ఉప్పు ఎడారిలో హీరోయిన్‌ పుషప్స్‌

26 Jan, 2021 19:17 IST|Sakshi

'ఝుమ్మంది నాదం' సినిమాతో రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టింది హీరోయిన్‌ తాప్సీ. ఆ సినిమా మ్యూజికల్‌ హిట్‌ అవడంతో తెలుగు, తమిళంలో ఎన్నో అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. వచ్చిన ఛాన్స్‌ను మిస్‌ చేసుకోకుండా చిన్నా పెద్ద తేడా లేకుండా అందరు హీరోలతో కలిసి నటించిన ఆమె 'ఛష్మి బద్దూర్'‌తో బాలీవుడ్‌కి మకాం మార్చింది. తర్వాత పూర్తిగా అక్కడే సెటిలైన ఈ భామ తాజాగా 'రష్మీ రాకెట్'‌ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. సోమవారం గుజరాత్‌లో ఈ సినిమా షూటింగ్‌ పూర్తవగా అక్కడి ఎడారి దారులను భారంగా వీడుతూ ముంబైకి తిరుగు ప్రయాణం అయింది తాప్సీ. (చదవండి: కృష్ణ కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమా ఇది)

ఈ క్రమంలో తెల్లని ఉప్పు ఎడారిగా ప్రసిద్ధి చెందిన రాణ్‌ ఆఫ్‌ కచ్‌లో పుషప్స్‌ చేసిన వీడియోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. "ఓ పర్యాటకురాలిగా ఈ అందమైన ప్రదేశంలో ఏదైనా చేయాలనిపించింది. అందుకే పుషప్స్‌ చేస్తున్నా. మట్టిని తాకిన అనుభూతి చెందాలంటే మీరు కూడా జాకెట్‌ను తీసేయండి, మీలో ప్రవహించే కొత్త బలాన్ని అనుభూతి చెందండి. కొన్ని పుషప్స్‌ చేశాక నా మొహం వీడియోలో కనిపించడం లేదని అర్థమైంది. కాబట్టి ఏదైనా చేసేముందు అది మీరే అని గుర్తించేలా మీ తల కాస్త తిప్పండి. అయినా ఎన్ని చేసినా ఏం లాభం లేదు అని అర్థమయ్యాక మీ బిస్తరు సర్దుకుని వెళ్లిపోండి. నెక్స్ట్‌ టైమ్‌ పుషప్స్‌ కాకుండా మరేదైనా చేద్దాం" అంటూ చెప్పుకొచ్చింది. క్రీడా నేపథ్యంలో సాగే 'రష్మీ రాకెట్‌' చిత్రానికి ఆకర్ష్‌ ఖురానా దర్శకత్వం వహిస్తుండగా రోనీ స్క్రూవాలా, నేహా ఆనంద్‌, ప్రంజల్‌ ఖంద్‌దియా నిర్మిస్తున్నారు. (చదవండి: తేజ సినిమా: కాజల్‌ పోయి.. తాప్సీ వచ్చే)

మరిన్ని వార్తలు