తెలంగాణలో థియేటర్స్‌ మూసివేతపై మంత్రి తలసాని క్లారిటీ

3 Dec, 2021 18:22 IST|Sakshi

కరోనా థర్డ్‌వేవ్‌ వచ్చిందని, ఇక సినిమా థియేటర్స్‌ మూసివేస్తారనే అసత్యాలను నమ్మొద్దని తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కోరారు. ప్రజలు ధైర్యంగా థియేటర్స్‌కి వెళ్లి సినిమాలు చూడొచ్చని చెప్పారు. శుక్రవారం ఆయన టాలీవుడ్‌కి చెందిన నిర్మాతలు, దర్శకులతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  కరోనా దృష్ట్యా థియేటర్‌లపై ఆంక్షలు విధిస్తారనే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.

‘కరోనా కారణంగా రెండేళ్లుగా సిని పరిశ్రమ ఇబ్బంది పడింది. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్‌ వస్తుందనే భయాలు మొదలయ్యాయి. ప్రజలు భయాన్ని వదిలి ధైర్యంగా థియేటర్లకి వెళ్లి సినిమాలు చూడండి. అన్ని ఎదర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సినీ పరిశ్రమపై వేల కుటుంబాలు ఆధారపడ్డాయి. వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు వస్తున్నాయి. నిర్మాతతు ఇబ్బందులు పడొద్దు. కొన్ని సమస్యలతో పాటు టిక్కెట్ ధరల పెంపు అంశం పెండింగ్‌లో ఉంది. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృష్టి చేస్తా’అని మంత్రి హామీ ఇచ్చారు. ఈ భేటీలో దిల్‌రాజు, డీవీవీ దానయ్య, చినబాబు, యేర్నేని నవీన్‌,  రాజమౌళి, త్రివిక్రమ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు