Talasani Srinivas Yadav: వజ్రోత్సవ వేడుకలపై సినీ ప్రముఖులతో మాట్లాడిన తలసాని

6 Aug, 2022 08:34 IST|Sakshi
మంత్రి తలసానితో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఈ నెల 9 నుండి 22 వరకు ఘనంగా నిర్వహించేలా తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఫిలిం డెవలప్‌మెంట్‌ అధికారులు, తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు తదితరులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు తలసాని. 

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ‘‘మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుగారి ఆదేశాల మేరకు వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ఇంటికో జెండాను అందజేయనున్నాం. ఇక విద్యార్థులందరికీ మహాత్మా గాంధీ చరిత్రను తెలియజెప్పే, విద్యార్థి దశ నుండే దేశభక్తిని పెంపొందించే విధంగా తెలుగు, హిందీ భాషలలో రూపొందించిన చిత్రాలను రాష్ట్రంలోని 2.77 లక్షల సీట్ల సామర్థ్యంతో ఉన్న 563 స్క్రీన్లలో ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విద్యార్థులను థియేటర్‌లకు తీసుకెళ్ళే రవాణా ఏర్పాట్లను కూడా ప్రభుత్వమే చేపడుతుంది. అలాగే సినిమాల ప్రదర్శన సమయాల్లో వారికి తగిన సౌకర్యాలను కల్పిస్తాం’’ అని చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ స్టేట్‌ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు సునీల్‌ నారంగ్, కార్యదర్శులు అనుపమ్‌ రెడ్డి, దామోదర్‌ ప్రసాద్, ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు బసిరెడ్డి, ఎఫ్‌డీసీ ఈడీ కిషోర్‌బాబులతో పాటు యూఎఫ్‌ఓ క్యూబ్‌ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు