Karthikeya 2: కొన్ని సినిమాలు ఆడవని తెలిసినా మొహమాటానికి అలా చేయాల్సి ఉంటుంది, కానీ..

13 Aug, 2022 09:11 IST|Sakshi

‘‘కార్తికేయ’ సినిమా చూశాను.. బాగుంది. ఆ సినిమాలానే ‘కార్తికేయ 2’ కూడా మంచి హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. తెలుగు చిత్రపరిశ్రమ మూడు పువ్వులు ఆరుకాయలుగా ముందుకు వెళ్లాలి’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ 2’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌  నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘కార్తికేయ 2’ తీసిన స్పిరిట్‌ నన్ను ఇక్కడికి నడిపించింది. ఇండస్ట్రీకి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు, సినిమానే దాన్ని అధిగమిస్తుంది.. ఎటువంటి పరిస్థితులకి ఇండస్ట్రీ లొంగలేదు’’ అన్నారు. ‘

‘కొన్ని సినిమాలు ఆడవని తెలిసినా మొహమాటానికి కొన్నిసార్లు ఫంక్షన్స్‌కి రావాల్సి ఉంటుంది. కానీ, ‘కార్తికేయ 2’ చాలా బాగుంది’’ అన్నారు ఎంపీ, రచయిత విజయేంద్ర ప్రసాద్‌. ‘మా సినిమా కచ్చితంగా బాగుంటుంది’’ అన్నారు చందు మొండేటి. ‘‘మంచి కంటెంట్‌తో సినిమాలు చేస్తే ఆడియన్స్‌ థియేటర్‌కి వస్తారని ఇటీవల ‘బింబిసార, సీతారామం’ నిరూపించాయి. అలానే మా సినిమాకి కూడా బుకింగ్స్‌ బాగున్నాయని మా నిర్మాతలు చెప్పడం సంతోషంగా ఉంది’’ అన్నారు నిఖిల్‌.

మరిన్ని వార్తలు