తమన్నా భాటియా మాలీవుడ్ ఎంట్రీ షురూ అయింది. బాలీవుడ్లో కథానాయికగా పరిచయం అయిన ఈ ఉత్తరాది భామకు అక్కడ ఆశించిన అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్పై దృష్టి సారించింది. ఇక్కడ కేడీ చిత్రంతో రంగప్రవేశం చేసింది. ఆ చిత్రం కూడా తమన్నాను నిరాశపరిచింది. అలాంటి సమయంలో తెలుగులో హ్యాపీడేస్ చిత్రంలో నటించే అవకాశం ఈ అమ్మడిని వరించింది.
ఆ సినిమా సక్సెస్ ఆమె దశను మార్చేసింది. అదే సమయంలో తమిళ్లో సైతం కల్లూరి చిత్రం మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమలోనూ ప్రవేశించింది. ఇలా నాలుగు భాషల్లో కథానాయకగా నటిస్తూ అదే సమయంలో ఐటమ్ సాంగ్లోను ఇరగదీస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. 17 ఏళ్ల సినీ కెరియర్లో తమన్నా ఇన్నాళ్లకి మాలీవుడ్ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతోంది. దీని గురించి ఆమె ఒక భేటీలో పేర్కొంటూ మలయాళంలో తొలిసారిగా అరుణ్ గోపి దర్శకత్వంలో దిలీప్ జంటగా నటించబోతున్నట్లు పేర్కొంది.
నటనకు అవకాశం ఉన్న పాత్ర ద్వారా పరిచయం కావడం సంతోషంగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ చిత్రం ద్వారా మలయాళ సినీ ప్రేక్షకుల అభినందనలు పొందే ప్రయత్నం చేస్తానని తమన్నా పేర్కొంది. కాగా ప్రస్తుతం తెలుగులో గుర్తుందా శీతాకాలం, చిరంజీవితో భోళాశంకర్, హిందీలో బబ్లీ బౌన్సర్ చిత్రాల్లో నటిస్తోంది. వీటితోపాటు వెబ్ సిరీస్లోనూ నటిస్తున్న తమన్న తాజాగా తమిళంలో రజినీకాంత్ కథానాయకుడుగా నటిస్తున్న జైలర్ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తోంది.సిద్ధమవుతోంది.
చదవండి: (గ్యాంగ్స్టర్గా విజయ్.. ఆమెతో ముచ్చటగా మూడోసారి?)