తమిళ చిత్రానికి అంతర్జాతీయ గౌరవం..

8 Feb, 2021 11:04 IST|Sakshi

దర్శకుడు పీఎస్‌ వినోద్‌ రాజ్‌ తెరకెక్కించిన తమిళ చిత్రం కూజంగల్‌(గులకరాళ్లు) చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. 50వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ రోటర్‌డామ్‌లో(ఐఎఫ్ఆర్ఆర్) భాగంగా కూజంగల్‌ ‘టైగర్ అవార్డు’ను సొంతం చేసుకుంది. ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని పొందిన మొదటి తమిళ చిత్రం ఇదే. దీనిని కోలీవుడ్‌ కపుల్‌ నయనతార విఘ్నేష్‌ శివన్‌ కలిసి రౌడీ పిక్చర్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సందర్భంగా నెదర్లాండ్స్‌లోని ఐఎఫ్‌ఎఫ్‌ఆర్ కార్యక్రమంలో చిత్రయూనిట్‌తో కలిసి కూజంగల్ స్క్రీనింగ్‌లో విఘ్నేష్, నయనతార సందడి చేశారు. ఈ ఫోటోలను సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

కూజంగల్‌ చిత్రాన్ని గురువారం రోటర్‌డామ్ ఉత్సవంలో ప్రదర్శించారు. కాగా టైగర్‌ అవార్డును గెలుచుకున్న రెండవ భారతీయ చిత్రం కూజంగల్‌. మొదట 2017లో సనల్ కుమార్ ససిధరన్ తెరకెక్కించిన మలయాళ చిత్రం సెక్సీ దుర్గా ఈ అవార్డును గెలుచుకుంది. కాగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం రోటర్‌డామ్ విభిన్న ప్రయోగాతక చిత్రాలను గుర్తించడంలో ప్రసిద్ధి చెందింది. తాగుబోతు తండ్రికి, అతని కొడుక్కి మధ్య జరిగే కథనే కూజంగల్‌..ఇందులో నూతన నటులు కరుతదయ్యన్, చెల్లా పాండి నటించారు. ఇల్లు వదిలి వెళ్లిన తల్లిని తిరిగి తీసుకురావడానికి తండ్రీ, కొడుకులు చేసే ప్రయత్నమే ఈ సినిమా.

వినోద్‌ రాజ్‌కు దర్శకుడిగా కూజంగల్‌ మొదటి చిత్రం. అవార్డు అందుకోవడంపై ఆయన స్పందిస్తూ.. గులకరాళ్లు సినిమా టైగర్ అవార్డు 2021గెలుచుకున్నందుకు ఆనందంగా ఉంది. సినిమా కోసం మేం పడిన క‌ష్టానికి ఫలితం దక్కింది. సినిమాపై చూపిన ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు అని ట్వీట్‌ చేశారు. మరోవైపను దీనిపై విఘ్నేష్‌ స్పందిస్తూ.. టైగర్‌ అవార్డు గెలుచున్న మొదటి తమిళ చిత్రం కూజంగల్‌ అని పేర్కొన్నారు. ఈ సినిమా వెనుక దర్శకుడు వినోత్‌ కృషి ఎక్కువ ఉందన్నారు. ఈయన చేసిన మొదటి చిత్రానికే ఇంత పెద్ద గౌరవం లభించిందన్నారు. అవార్డు దక్కడం సంతోషంగా ఉందన్నాడు. 
చదవండి: నోరుపారేసుకున్న నెటిజన్‌.. అనసూయ గట్టి కౌంటర్‌
కేజీఎఫ్‌ 2 తర్వాతే రాధేశ్యామ్‌!

మరిన్ని వార్తలు