కరోనా కాటుకు మరో నిర్మాత బలయ్యారు. ఇటీవల కాలంలో హాస్య నటుడు వివేక్, దర్శకుడు తామిరై, ఛాయాగ్రహకుడు, దర్శకుడు కేవీ.ఆనంద్, సీనియర్ నటుడు సెల్లముత్తు, నిర్మాత బాబు రాజా, నందగోపాల్ తదితరులు కరోనా, ఇతరత్రా సమస్యల కారణంగా కన్నుమూశారు. తాజాగా నటుడు కృష్ణ, స్వాతి జంటగా యాగై చిత్రాన్ని నిర్మించిన ముత్తు కుమరన్ కరోనాతో శనివారం మృతిచెందారు. అనారోగ్యంతో ఇటీవల చెన్నై ప్రభుత్వాస్పత్రిలో చేరిన ఈయనకు వైద్యపరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో చికిత్స పొందుతూ వచ్చిన ముత్తు కుమరన్ పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ముత్తు కుమరన్ మృతికి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.