Tamil Rockerz OTT Release: ఆ ఓటీటీలోకి ‘తమిళ రాకర్స్‌’.. ఎప్పుడంటే..

10 Aug, 2022 09:22 IST|Sakshi

ఏవీఎం ప్రొడక్షన్స్‌. ఈ పేరు విజయాలకు చిరునామా. ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేశన్, రజినీకాంత్, కమలహాసన్‌ వంటి గొప్ప నటులందరూ ఈ సంస్థలో నటించిన వారే. అలాంటి సంస్థ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. తాజాగా ఈ సంస్థ మళ్లీ చిత్రాలను నిర్మించడం ప్రారంభించింది. ఏవీ మెయ్యప్పన్‌ కుటుంబం నుంచి 4వ తరం చెందిన అరుణ గుహన్‌ తాజాగా చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ముందుగా తమిళ రాకర్స్‌ పేరుతో వెబ్‌సిరీస్‌ను రూపొందించారు. అరివళగన్‌ దర్శకత్వం వహించిన ఎనిమిది భాగాలతో ఈ వెబ్‌సిరీస్‌లో నటుడు అరుణ్‌ విజయ్, నటి ఐశ్వర్య మీనన్, వాణిభోజన్‌ హీరో హీరోయిన్లుగా నటించారు.

సోనీ లివ్‌ సంస్థ భాగస్వామ్యంలో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 19వ తేదీ నుంచి సోనీ లివ్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. నూతన చిత్రాలను పైరసీ చేస్తూ నిర్మాతల ఆదాయానికి గండి కొడుతున్న తమిళరాకర్స్‌ నేపథ్యంలో రూపొందించిన వెబ్‌సిరీస్‌ ఇదని దర్శకుడు అరివళగన్‌ తెలిపారు. ఇందులో అరుణ్‌ విజయ్‌ పోలీసు అధికారిగాను, ఆయనకు జంటగా ఐశ్వర్య మీనన్, సహ పోలీసు అధికారిణిగా వాణి భోజన్‌ నటించారని తెలిపారు. ఇందులో రొమాన్స్‌ సన్నివేశాలు పరిధికి మించకుండా ఉంటాయన్నారు. నటుడు అరుణ్‌ విజయ్‌ మాట్లాడుతూ అరివళగన్‌ దర్శకత్వంలో ఇంతకుముందు రెండు చిత్రాలలో నటించానన్నారు. తాను నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ఇదేనన్నారు. వెబ్‌ సిరీస్‌ ద్వారా విషయాన్ని మరింత విఫులంగా చెప్పే వీలు ఉంటుందని పేర్కొన్నారు. అరుణ గుహన్‌ మాట్లాడుతూ కథ నచ్చడంతో ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. త్వరలోనే భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఆమె వెల్లడించారు.

మరిన్ని వార్తలు