యాక్టింగ్‌ వద్దన్నందుకు.. ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు బుల్లితెర నటి ప్లాన్‌, చివరికి..

29 Mar, 2023 21:06 IST|Sakshi

తమిళ సీరియల్‌ నటి రమ్య ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే చంపాలనుకుంది. పోలీసుల విచారణలో రమ్య కుట్ర బట్టబయలు కావడంతో నటిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడఘలోని నల్లగౌండన్‌కు చెందిన నటి రమ్య దంపతులు బైక్‌పై వెళుతున్నారు. ఇంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తి తన వాహనంతో వీరి బైక్‌ను ఢీ కొట్టాడు. వెంటనే సదరు వ్యక్తి.. కిందపడిన రమేశ్‌ను తన దగ్గరున్న బ్లేడుతో గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయంతో ఆస్పత్రిలో చేరిన రమేశ్‌ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు రమ్య పొంతన లేని సమాధానాలు చెప్తుండటంతో తనపై అనుమానం పెరిగింది. పోలీసులు ఆమె సెల్‌ఫోన్‌ పరిశీలించగా తనే భర్తను హత్య చేసేందుకు ప్లాన్‌ వేసినట్లు వెల్లడైంది.

దంపతుల మధ్య దూరం పెరిగిందిలా..
రమ్య, రమేశ్‌ల మధ్య కొంతకాలం కిందట బేధాభిప్రాయాలు వచ్చాయి. రమ్య సీరియల్స్‌లో నటించడం తనకు ఇష్టం లేదని రమేశ్‌ చెప్పాడు. కానీ రమ్య అతడి మాట వినిపించుకోలేదు. ఈ క్రమంలో వీరి మధ్య తగాదాలు చోటుచేసుకున్నాయి. మాటామాటా పెరిగి గొడవలు పెద్దవి కావడంతో కొద్ది నెలలుగా వీరు కలిసి ఉండటం లేదు. నటిగానే కెరీర్‌ కొనసాగించాలనుకున్న రమ్య.. 'సుందరి', 'కన్నేదిరే తొండ్రినాల్‌' వంటి సీరియల్స్‌లో నటించింది.

అదే సమయంలో సహనటుడు డేనియల్‌ (చంద్రశేఖర్‌)తో సన్నిహితంగా మెలగసాగింది. అతడితో కలిసి భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. అటు చంద్రశేఖర్‌ కూడా రమేశ్‌ ఇల్లును పది లక్షలకు కొనుగోలు చేసుకోవాలనుకున్నాడు. అంత తక్కువ మొత్తానికి ఇల్లు అమ్మడం కుదరదన్నాడు రమేశ్‌. దీంతో ఇద్దరూ కలిసి రమేశ్‌ను అంతమొందించాలని ప్లాన్‌ చేశారు. చివరికి ప్లాన్‌ ఫెయిలవడంతో ఇద్దరూ కోయంబత్తూరు సెంట్రల్‌ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు.

మరిన్ని వార్తలు