స్టార్‌ హీరో కొడుకుతో ఉప్పెన తమిళ రీమేక్‌!

18 Feb, 2021 15:20 IST|Sakshi

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అయిన చిత్రం 'ఉప్పెన'. ఈ నెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి రికార్డులు సృష్టిస్తోంది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రం... లాక్‌డౌన్‌ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. దేవీశ్రీ సంగీతం, విజయ్‌ సేతుపతి నటన ఈ సినిమా విజయంలో సగ భాగం అయింది. అయితే  ఈ సినిమాను టాలీవుడ్‌తో పాటు తమిళ్‌లో కూడా విడుదల చేయాలని తొలుత భావించారట. విజయ్ సేతుపతికి అక్కడ భారీగా క్రేజ్ ఉంది కాబట్టి తప్పకుండా ఉప్పెనను తమిళ్‌లో డబ్‌ చేసి విడుదల చేయాలని అనుకున్నారట. కానీ విజయ్ సేతుపతి మాత్రం వద్దని చెప్పినట్లు తెలుస్తోంది.

కథ బాగుందని, డబ్‌ చేయడం కంటే రీమేక్‌ చేస్తే మంచి వసూళ్లను రాబడుతుందని సలహా ఇచ్చారట. అందుకే తమిళ్‌లో విడుదల చేయకుండా కేవలం తెలుగులో మాత్రమే ఉప్పెనను విడుదల చేసింది చిత్ర బృందం. తమిళ రీమేక్‌ రైట్స్‌ను విజయ్‌ సేతుపతి తీసుకోబుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఈ సినిమాను స్టార్‌ హీరో కొడుకుతో రీమేక్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో అత్యధికంగా వసూలు చేసిన డెబ్యూ హీరో చిత్రంగా ఉప్పెన నిలిచింది. అంతేకాకుండా ఈ చిత్రంతో వైష్ణవ్‌ తేజ్‌..ఆల్‌ ఇండియా రికార్డులను బద్దలు కొట్టాడు. దీంతో ఈ సినిమాపై తమిళ హీరో దళపతి విజయ్‌ కన్ను పడిందట. ఉప్పెన తమిళ రీమేక్‌తో కొడుకు జాన్సన్‌ సంజయ్‌ను హీరోగా పరిచయం చేయాలని విజయ్‌ భావిస్తున్నాడట. దీనికి సంబంధించి ఇప్పటికే ఉప్పెన ప్రొడ్యూసర్స్‌ మైత్రి మూవీస్‌తో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే త్వరలోనే ఉప్పెన తమిళ రీమేక్‌ పనులు ప్రారంభం కానున్నాయి. మరి అదే జరిగితే హీరోయిన్‌గా కృతి శెట్టినే తీసుకుంటారా? లేదా కొత్త హీరోయిన్‌తో ప్రయోగం చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. 

చదవండి : (21 ఏళ్ల ఆల్‌టైం రికార్డులను తుడిచిపెట్టిన ‘ఉప్పెన’ )

(అదేంటో తెలుసుకోలేను.. బుచ్చిబాబుపై సుకుమార్‌ ఎమోషనల్)

మరిన్ని వార్తలు