ప్రముఖ నటి వీజే చిత్ర ఆత్మహత్య

9 Dec, 2020 09:18 IST|Sakshi

లక్షలాది మంది అభిమానులకు షాక్‌

మిస్టరీగా మరణం 

సమగ్ర విచారణకు తండ్రి విజ్ఞప్తి 

ఇటీవలే పారిశ్రామిక వేత్తతో నిశ్చితార్థం 

సాక్షి, చెన్నై : పాండియన్‌ స్టోర్స్‌ తమిళ ధారావాహికలో ముల్లై పాత్రకు జీవం పోసి లక్షలాది మంది అభిమానుల్ని కట్టిపడేసిన బుల్లితెర నటి చిత్ర (28) బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇది ఆమె అభిమానులకు పెద్ద షాక్‌గా మారింది. ఆమె ముఖంపై గాయాలు ఉండడంతో కేసు మిస్టరీగా మారింది. ఆత్మహత్య చేసుకున్న హోటల్‌లో ఆమె వెంట కాబోయే భర్త హేమనాథ్‌ కూడా ఉండడంతో ఆయన వద్ద విచారణ జరుగుతోంది. విజయ్‌ టీవీలో ‘పాండియన్‌ స్టోర్ట్స్‌’ పేరిట అన్నదమ్ముళ్ల అనుబంధాన్ని చాటే కుటుంబ కథా ధారావాహిక ప్రతిరోజూ ప్రసారం అవుతోంది. ఇందులో ఆ కుటుంబంలో మూడో కోడలిగా ప్రవేశించిన చిత్ర ముల్లై పాత్రకు చిత్ర జీవం పోశారని చెప్పవచ్చు.

గతంలో ఆమె టీవీ, స్టేజ్‌ షోల వ్యాఖ్యతగా వ్యవహరించినా, చిన్న చిన్న పాత్రల్లో కొన్ని ధారావాహికల్లో కనిపించినా, ముల్లై పాత్రతో లక్షలాది మంది గుండెల్లో గుడి కట్టుకున్నారు. ఆమె ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా్రగామ్‌లలో పదిహేనుల లక్షల మంది ఫాలోయర్స్‌ ఉండడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో సెంబరంబాక్కంలోని ఈవీపీ ఫిల్మ్‌ సిటీలో సాగుతున్న ధారావాహిక షూటింగ్‌ను ముగించుకుని బుధవారం వేకువజామున రెండున్నర గంటలకు హోటల్‌కు వెళ్లిన కొన్ని గంటల్లో చిత్ర బలవన్మరణ సమాచారం రావడం ఆ యూనిట్‌కే కాదు, అభి మానులకు పెద్ద షాక్కే. 

కాబోయే భర్తతో హోటల్‌లో.. 
తిరువాన్నియూరుకు చెందిన రిటైర్డ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కామరాజ్‌ కుమార్తె ఈ చిత్ర. కరయాన్‌ చావడికి చెందిన పారిశ్రామిక వేత్త హేమనాథ్‌తో చిత్ర వివాహ నిశి్చతార్థం ఇటీవల జరిగింది. ఈవీపీ నుంచి తిరువాన్నియూరుకు వెళ్లి రావడానికి ఇబ్బందిగా ఉండడంతో పలంజూరులోని ఓ హోటల్‌లో ఆమెకు ఓ గదిని కేటాయించారు. బుధవారం వేకువజామున రెండున్నర గంటలకు షూటింగ్‌ ముగించుకుని హోటల్‌కు ఆమె వచ్చారు. తనకు కాబోయే భర్త హేమనాథ్‌తో కలిసి గదిలోకి వెళ్లారు. ఆ గదిలో ఏమి జరిగిందో ఏమోగానీ, లాబీ నుంచి హేమనాథ్‌ రిసెప్షన్‌కు పరుగులు తీసి, అక్కడున్న సిబ్బంది గణేషన్‌ ద్వారా మరో తాళం తీసుకుని చిత్ర ఉన్న గదిని తెరిచారు. అప్పటికే ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతుండడం ఓ మిస్టరీగా మారింది. నషరత్‌ పేట సీఐ విజయరాఘవన్‌ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. 

ఆర్డీఓ విచారణ..
స్నానం చేసి వచ్చే వరకు లాబీలో ఉండాలని చెప్పి చిత్ర తలుపు వేసుకున్నట్టు పోలీసులకు హేమనాథ్‌ వివరించారు. ఎంతకు తలుపు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన గణేషన్‌ ద్వారా మరో తాళం తీసుకుని లోనికి వెళ్లి చూసినట్టు పేర్కొన్నాడు. అదే సమయంలో తామిద్దరికి అక్టోబర్‌ 19న రిజిస్టర్‌ మ్యారేజ్‌ కూడా జరిగినట్టు హేమనాథ్‌ చెప్పడంతో, కేసు ఆర్‌డీఓ విచారణకు దారి తీసింది. చిత్ర మరణ సమాచారం అందుకున్న ఆమె తండ్రి కామరాజ్‌ కీల్పాకం ఆస్పత్రికి చేరుకుని కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. అక్కడి నుంచి నేరుగా నషరత్‌ పేట పోలీసుస్టేషన్‌కు చేరుకుని తన కుమార్తె మరణానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరగాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

చిత్ర కుడివైపు ముఖం భాగంలో, గొంతు, నాడి భాగంలో గాయాలు ఉండడం అనుమానాలకు దారి తీశాయి. దీంతో పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.  హేమనాథ్‌ వద్ద తీవ్ర విచారణ సాగుతోంది. షూటింగ్‌ నుంచి రావ డానికి గల ఆలస్యంపై ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు సమాచారం. ఆ హోటల్‌ సిబ్బంది గణేషన్‌ వద్ద కూడా విచారణ సాగుతోంది. ఆత్మహత్య తప్పు అని పదే పదే చెప్పుకొచ్చే చిత్ర ఈ చర్యకు పాల్పడి ఉండే అవకాశాలు లేదు అని ఆమె మిత్రులు, సహచర నటీమణులు పేర్కొంటున్నారు. తన భవిష్యత్తు గురించి ఆమె ఎంతగానో కలలు కంటున్నదని, ఆమె కష్టాలకు తగ్గ ఫలితం దక్కుతున్న సమయంలో ఇలా జరగడం జీరి్ణంచుకోలేకున్నామని బుల్లి తెర సహచర నటీ మణులు ఆవేదన వ్యక్తం చేశారు.


 

మరిన్ని వార్తలు