సోనూసూద్‌ను సత్కరించిన తనికెళ్ల భరణి

21 Nov, 2020 11:42 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్‌ సమర్పణలో మాట్నీ మూవీస్‌ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, రామ్‌ చరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. మరికొన్ని రోజుల్లో చిరంజీవి షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఈ క్రమంలో తాజాగా నటుడు సోనూసూద్‌ ఆచార్య సినిమా షూటింగ్‌ సెట్స్లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌లో సోనూసూద్‌ అందించిన మానవత సేవలను ప్రశంసిస్తూ సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి, దర్శకుడు కొరటాల శివ, చిత్ర యూనిట్‌తో కలిసి ఆచార్య సెట్‌లో సత్కరించారు. శాలువ కప్పి, మెమొంటో అందజేశారు. ఈ ఫోటోలను నిర్మాత బీఏ రాజు తన ట్విటర్‌లో పోస్టు చేశారు. ​ఇదిలా ఉండగా ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ షూటింగ్‌లో సోనూసూద్ పాల్గొన్న విషయం తెలిసిందే. చదవండి: పంజాబ్‌ స్టేట్‌ ఐకాన్‌గా ‘రియల్‌ హీరో’

కాగా కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ అందించిన సేవలు మరువరానివి. అనేక మంది వలస కార్మికులకు తన సొంత ఖర్చులతో బస్సులు, రైలు, విమానం ఏర్పాటు చేసి గమ్య స్థానాలకు చేర్చారు. విదేశాల్లోని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా విమానాన్ని వేసి, ఆపదలో ఉన్న వారిని ఆదుకొని ప్రజల మనస్సుల్లో ‘రియల్‌ హీరో’గా నిలిచాడు.  తన దృష్టికి వచ్చిన ఏ సమస్యకైనా తోచినంత సాయం చేస్తూ మానవత్వం చాటుకున్నారు. ఓవైపు షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ.. తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని సోనూసూద్‌ కలుసుకొని వారి సమస్యలను ఓపికగా విని పరిష్కరిస్తున్నాడు. చదవండి: వైరల్‌ అవుతున్న సోనూసూద్‌ వీడియో

మరిన్ని వార్తలు