వారికిది ఆస్కార్‌ అవార్డుతో సమానం: తనికెళ్ల భరణి

24 Apr, 2022 12:01 IST|Sakshi

‘పూర్వం నాటకాలను పోషించేవారిని మహారాజు శ్రీ కృష్ణదేవరాయలుతో పోల్చేవారు. ఈ రోజుల్లోను ఇంకా కృష్ణదేవరాయల కాలం నాటి మహారాజ పోషకులు సీఆర్‌సి కాటన్‌ కళా పరిషత్‌ రూపంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు.నాటక రంగానికి సీఆర్‌సీ ఫాండేషన్‌ చేస్తున్న కృషి వెలకట్టలేదిని’అన్నారు ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి. వచ్చే ఏడాది రావులపాలెంలోని సీఆర్‌సి నాటక కళా పరిషత్‌ 23వ ఉగాది నాటకోత్సవాలలో జరగబోయే నాటక పోటీల కోసం ప్రత్యేకంగా శనివారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. ‘22ఏళ్ల క్రితం సీఆర్‌సి కాటన్‌ కళా పరిషత్‌ వెలసింది. ప్రముఖ దర్శకులు ఎస్వీ. కృష్ణారెడ్డిగారు చెప్పడంతో ఓ సారి నేను రావులపాలెం  సీఆర్‌సిక్లబ్‌కి వెళ్లాను. తర్వాత  సీఆర్‌సి ఫౌండేషన్‌ వారు చేస్తున్న  అనేక రకాలైన సేవ కార్యక్రమాలను చూసి షాకయ్యాను. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న మీరు నాటక కళా పరిషత్‌ను స్థాపించి మంచి నాటకాలు వేయించొచ్చు కదా అన్నాను. అప్పుడు వారు సదుపాయలు ఏం కావాలన్నా మేము చేస్తాం కాని, నాటకానికి సంబంధించిన కార్యక్రమాలను మీరు దగ్గరుండి చూసుకుంటే నాటక పరిషత్‌ నిర్వహించటానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని పరిషత్‌ నిర్వాహకుడైనటువంటి విక్టరీ వెంకట్‌రెడ్డి గారు అనటంతో నేను గౌరవాధ్యక్షునిగా రంగప్రవేశం చేశాను.

22 ఏళ్లుగా అద్భుతమైన నాటకాలు ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉన్నా. కొత్త వాళ్లను ప్రొత్సహించడానికి తొలి ఉత్తమ ప్రదర్శనకు మూడు లక్షల రూపాయలు, రెండో ఉత్తమ నాటకానికి రెండు లక్షల రూపాయలు, మూడో ఉత్తమ బహుమతికి లక్ష రూపాయల ప్రైజ్‌మనీని ప్రకటించాం. ఇది భారతదేశంలోనే నాటక కళాకారులకిచ్చే పెద్ద మొత్తం. ప్రపంచంలోని నలుమూలలా ఉండే నాటక ప్రియులంతా ఈ నాటకాల్లో పాల్గొనాలని కోరుతున్నా. ఇది  నిజంగా నాటకానికి  మహర్దశ అనొచ్చు.  నాటక కళాకారులకు ఈ అవకాశం ఆస్కార్‌ అవార్డుతో సమానం. కాబట్టి ఆసక్తి గల వారందరూ కొత్త నాటకాలతో రావాలని కోరుతున్నా’అన్నారు. 

కన్వీనర్‌ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ– ‘నేను బిజినెస్‌ మ్యాన్‌ని, మా పిల్లలు ఎప్పుడూ క్లాస్‌ ఫస్ట్‌ ఉండాలి అనుకుని వాళ్లను బాగా చదవాలి అని ఫోర్స్‌ చేసేవాడిని. కానీ పరిషత్‌ నాటకాలు పెట్టిన ఆరో ఏడాది ‘హింసధ్వని’ అనే నాటకం చూశాను. ఆ నాటకం చూసిన తర్వాత నేను ఎప్పుడు క్లాస్‌ఫస్ట్‌ రావాలని, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని మా పిల్లల్ని ఇబ్బంది పెట్టలేదు. అంతగా ఆ నాటకం నన్ను కదిలించింది’ అన్నారు.ఈ కార్యక్రమానికి అతిధిగా, యాంకర్‌గా ప్రముఖ నటి ఝాన్సీ వ్యవహరించారు. 

మరిన్ని వార్తలు