ట్రిపుల్‌ ధమాకా

14 Dec, 2020 05:40 IST|Sakshi

ఇప్పటివరకూ నాగచైతన్య హీరోగా నటించిన సినిమాలు ఇరవై. వీటిలో ఇద్దరు కథానాయికలున్న చిత్రాలు ఉన్నాయి. కానీ ముగ్గురు కథానాయికలతో ఇప్పటివరకూ చైతూ సినిమా చేయలేదు. ఇప్పుడు చేయనున్నారని తెలిసింది. అక్కినేని కుటుంబానికి ‘మనం’లాంటి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇచ్చిన విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో చైతూ ‘థ్యాంక్యూ’ సినిమా కమిట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం దసరా సందర్భంగా లాంఛనంగా ఆరంభమైంది.

ఈ నెలాఖరున రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభం కానుందని సమాచారం. ఇందులో చైతూ సరసన ముగ్గురు కథానాయికలు నటిస్తారని యూనిట్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంటే.. అక్కినేని అభిమానులకు చైతన్యను ముగ్గురు నాయికల సరసన చూడటం ట్రిపుల్‌ ధమాకా అన్నమాట. ప్రస్తుతం ముగ్గురు నాయికల ఎంపిక జరుగుతోంది. ఇందులో చైతన్య పల్లెటూరి కుర్రాడు, ఎన్నారైగా కనిపించనున్నారట. ‘మనం’ తర్వాత చైతూ–విక్రమ్‌ కుమార్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు