సినిమాలను థియేటర్ లోనే విడుదల చేయండి

7 Jul, 2021 15:57 IST|Sakshi

తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌

సాక్షి, హైదరాబాద్‌ : ప్రస్తుతమున్న పరిస్థితుల్లో చిత్ర నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేయొద్దని థియేటర్ల ఓనర్లు విఙ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ..వచ్చే మూడు నెలల వరకైనా సినిమాలను ఓటీటీలో విడుదల చేయొద్దు. ఇప్పటికే  మా ఒంటి నిండా బాణాలు గుచ్చుకున్నాయి. దయచేసి కత్తితో పొడిచి చంపకండి. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా అక్టోబర్ తరువాతే ఓటీటీకి ఇవ్వండి అంటూ నిర్మాతలను కోరారు.ఈ సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు మురళీమోహన్, సెక్రెటరీ సునీల్ నారంగ్, జాయింట్ సెక్రటరీ గోవింద్ రాజ్, విజయేంద్ర రెడ్డి,  అనుపమ్ రెడ్డి, అభిషేక్ నామా సహా తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ... "మా అందరి అభిప్రాయం ఒక్కటే..అక్టోబర్‌ 30 వరకు  నిర్మాతలందరూ కూడా తమ సినిమాలను ఓటీటీలకు అమ్మకండని రిక్వెస్ట్‌ చేస్తున్నాను. ఆ తరువాత కూడా బాగా లేదంటే ఓటీటీలకు అమ్ముకోండి. నిర్మాతలెవ్వరూ కూడా ఇప్పుడే ఓటీటీలకు వెళ్లకండి’అన్నారు.

తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ సునీల్‌ నారంగ్‌ మాట్లాడుతూ.. "ఈ మీటింగ్‌ ఏర్పాటు చేసిందుకు అందరికీ థ్యాంక్స్‌. ఈ విషయం అందరికీ తెలియాలి. మనం ఏం చేస్తున్నాం ఏం చేయబోతోన్నామనేది అందరికీ తెలియాలి. మీ రిక్వెస్ట్‌ ఏంటి? అని చాలా మంది నిర్మాతలు ఫోన్‌ చేసి అడుగుతున్నారు. అందరికీ తెలియాలనే ఈ ప్రెస్‌ మీట్‌ పెట్టాం. ఆగస్ట్‌ మొదటి వారంలో అంతా సద్దుమణిగేట్టు కనిపిస్తోంది. చిన్నవాళ్లు అమ్ముకున్నారంటే పర్లేదు.. కనీసం పెద్ద వాళ్లు అయినా కూడా ఆపుకోవాలి కదా?. కనీసం అక్టోబర్‌ 30 వరకైనా ఆపుకోండి.  సినిమాను కాపాడండి. ఓటీటీకి సినిమాలు ఇవ్వకండి..నేను కూడా సినిమాలు తీస్తున్నా. నేను కూడా నిర్మాతనే. నాక్కూడా ఆ బాధలు తెలుసు. నిర్మాత కంటే డిస్ట్రిట్యూబర్స్, ఎగ్జిబిటర్స్‌ ఎక్కువ బాధలు పడుతున్నారు.

 అందుకని, ఓటీటీకి సినిమాలు ఇవ్వకండి. ఒకవేళ అక్టోబర్ 31వరకు థియేటర్లు ఓపెన్ కాకపోతే అప్పుడు ఇచ్చుకోండి. మేం నిర్మించిన 'లవ్ స్టోరీ' సినిమాకు పది ఆఫర్లు వచ్చాయి. అయినా ఓటీటీలకు ఇవ్వలేదు. మా రిక్వెస్ట్‌ను నిర్మాతలందరూ వింటారని అనుకుంటున్నాను.. నమస్కారం పెట్టి మరీ రిక్వెస్ట్‌ చేస్తున్నాను. హీరోలకు కూడా ఓటీటీలకు సినిమాలు ఇవ్వడం ఇష్టం లేదు. వాళ్ళు మాకు మద్దతు ఇస్తారు. థియేటర్లు ఓపెన్ అయితే ఓటీటీలు 40, 50 కోట్ల ఆఫర్లు ఇవ్వవు. థియేటర్స్ ప్రజెంట్ క్లోజ్ ఉన్నాయి కాబట్టి అంత అమౌంట్ ఇస్తున్నాయి. అందుకని, అక్టోబర్ వరకు వెయిట్ చేయండి’ అని అన్నారు.

తెలంగాణ థియేటర్స్‌ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విజయేందర్‌ రెడ్డి మాట్లాడుతూ – ‘ఓటీటీ చట్టం కల్పించిన హక్కు కానే కాదు. సినిమాలను ఎవ్వరికైనా అమ్ముకోడం నిర్మాత హక్కు. సినిమాలు రిలీజైన పది వారాలకో ఎప్పుడో ఓటీటీకి అమ్ముకోవాలనే కండీషన్ తో పది కోట్లకో ఇరవై కోట్లకో డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కుంటున్నారు. అలా కొనుక్కున్న రోజునే అగ్రిమెంట్లో ఎంటర్‌  చేస్తే.. మా ఛాంబర్‌ చర్య తీసుకుంటుంది.   నిర్మాతలం మాకు హక్కు ఉంటుందని కాకుండా.. అక్టోబర్‌ వరకు ఎదురు చూడండి. అక్టోబర్‌ వరకు  పరిస్థితు సద్దుమణకపోతే, ప్రభుత్వాలు అనుమతి ఇవ్వకపోతే, కరోనా తగ్గకపోతే అప్పుడు ఓటీటీకి వెళ్లండి. నిర్మాతలందరికీ ఇది మా రిక్వెస్ట్‌. అందరూ ఓపికతో ఉండండి. థియేటర్ వ్యవస్థను ఓటీటీలు కిల్ చేయడానికి చూస్తున్నాయి. ఈ రోజు మమ్మల్ని కిల్ చేస్తే రేపు నిర్మాతలను కిల్ చేస్తాయి. నిర్మాతలకు వెంటనే షేర్ ఇచ్చేది మేమే. పీవీఆర్, ఐనాక్స్ వంటి కంపెనీలు ఎప్పుడు ఇస్తాయో తెలిసిందే. అలాగే, ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ చేస్తాయి’ అని అన్నారు.

చైర్మన్ డిస్ట్రిబ్యూషన్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభిషేక్‌ నామా మాట్లాడుతూ.. ‘ఈ పాండమిక్‌ వల్ల  అందరూ ఎంత బాధ పడ్డారో అందరం చూశాం. అందరి కంటే ఎక్కువగా కష్టాలు పడింది సినిమా పరిశమ్రకు చెందిన వాళే. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలో కోలుకుంటున్నాయి. కానీ ఒక్క సినీ ఇండస్ట్రీ మాత్రం ఇంకా అలానే ఉంది. ప్రతీ శుక్రవారం రాగానే థియేటర్ల వద్ద సందడి కనిపించేది. కానీ ఇప్పుడు అది లేదు. ఓటీటీ వచ్చి ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోను తీసేసింది. నిర్మాతలకు మంచి అమౌంట్‌ ఇచ్చి సినిమాలను తీసేసుకుంటున్నారు. అయితే థియేటర్లో సినిమా రిలీజ్‌ చేసిన ఆ తరువాత ఓ 20  రోజులకు ఓటీటీకి ఇస్తే అందరూ బాగుంటారు. థియేటర్లో టిక్కెట్‌ ఇచ్చే వ్యక్తి నుంచి ఎంతో మంది ఆధారపడి ఉన్నారు.. మీడియా కూడా ఆధారపడి ఉంది.. మీ సహకారం కూడా కావాలి.. అందరి సపోర్ట్‌ లేకపోతే దీన్ని మనం ముందుకు తీసుకెళ్లలేమ’ని అన్నారు.  

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ మాట్లాడుతూ.. ‘ఓటీటీల గురించి నిర్మాతలందరినీ మేం రిక్వెస్ట్ చేస్తున్నాం. అలా కాకుండా.. వాళ్లు తమ ఇష్టం మేరకు వెళ్తే.. మేం ఏం చేయాలో అది చేస్తాం.. ఆల్రెడీ ఇంతకు ముందు  కూడా చేసి చూపెట్టాం.. అది వారికి తెలియడం లేదు.. ఇప్పుడైతే మేం రిక్వెస్ట్ చేస్తున్నాం.. నిన్న కూడా రిక్వెస్ట్ చేసినం.. భవిష్యత్ అంతా కూడా సినిమా పరిశ్రమదే, థియేటర్లదే. ఫ్యామిలీలు అంతా కూడా సినిమాకు వెళ్లాలంటే పిక్నిక్ టైప్ ప్లానింగ్ చేసుకుంటున్నాయ్. ఇంట్లో కూర్చుని చూస్తుంటే ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తుంటే వాళ్లకి సినిమా ఏం అర్థమవుతుంది. ఇంకా 25 ఏళ్లు అయినా 50 ఏళ్లు అయినా కూడా థియేటర్ బతికే ఉంటుంది.. ఇది నా అభిప్రాయం’ అని అన్నారు.

కాగా, లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటికే పలు సినిమాలు ఓటీటీ బాట పట్టిన సంగతి తెలిసిందే. దీంతో థియేటర్‌ ఓనర్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కూడా ఎత్తివేసిన క్రమంలో అక్టోబర్‌ వరకు  తెలుగు నిర్మాతలెవరూ తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేయొద్దని ఓనర్లు విఙ్ఞప్తి చేశారు. ఇప్పటికే నిర్మాతలు ఓటీటీలో తమ సినిమాల్ని విడుదల చేయడం అక్టోబరు వరకు ఆపాలని తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్​ సూచించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు