భగవద్గీత ఒక మత గ్రంథం కాదు.. మనిషి గ్రంథం

18 Feb, 2023 16:51 IST|Sakshi

అర్జున్‌ అంబటి, చైతన్య రావు హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం తెప్ప సముద్రం. సతీష్‌ రాపోలు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది. ఈ సినిమాను బేబి వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నీరుకంటి మంజుల రాఘవేందర్‌ గౌడ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కొరమీను ఫేమ్‌ కిశోరి ధాత్రక్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మరో కీలకపాత్రను బొమ్మాళి రవిశంకర్‌ పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.  త్వరలో సింగర్‌ మంగ్లీ పాడిన మాస్‌ బీట్‌ సాంగ్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

మహాశివరాత్రి సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఒక టేబుల్‌ వెనుక చొక్కా వేసుకుని, దానిపై కాకీ చొక్కా వేసుకుని ఒక వ్యక్తి నిలబడి ఉండటం కనిపిస్తుంది. ఆ వ్యక్తి ఎవరు అనేది రివీల్‌ చేయకుండా సస్పెన్స్‌ని క్రియేట్‌ చేశారు. టేబుల్‌పై ఆ వ్యక్తి చేతులు పెట్టి ఉండటం. ఒక చేతి కింద భగవద్గీత వుండటం, మరో చేతిపై కత్తితో పొడిచి ఉండటం కనిపిస్తుంది. ఆ టేబుల్‌ ముందు భాగంలో ధర్మానికి ప్రతీకైన జాతీయ చిహ్నం ఉంటుంది. మరో పక్క శాంతికి చిహ్నమైన పావురం ఉండటం గమనించవచ్చు. నిల్చున్న వ్యక్తి వెనుక లా బుక్స్‌ వుండటంతో పాటు ఒక పవర్‌ఫుల్‌ కొటేషన్‌తో ముందుకొచ్చారు.

“భగవద్గీత మహాభారతంలో ఒక భాగం కాదు.. మహాభారతమే భగవద్గీతలో ఒక భాగం.. భగవద్గీత ఒక మత గ్రంథం కాదు.. మనిషి గ్రంథం..” అనే కొటేషన్‌లోనే అర్థం అవుతుంది భగవద్గీత గురించి ఎంత లోతుగా చెప్పబోతున్నారనేది. ఇప్పటివరకు భగవద్గీతను ఒక మతానికి చెందినది అనేది మాత్రమే అందరూ అనుకుంటున్నారు. కానీ భగవద్గీత కేవలం ఒక మతానికి కాదు మనిషులందరికీ సంబంధించినది అనేది ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నారని స్పష్టంగా తెలుస్తుంది. 

మరిన్ని వార్తలు