Tinu Verma: వెంట పరిగెత్తి మరీ కొట్టాను, సినిమాలో కూడా లేకుండా చేశా

29 Jul, 2022 18:57 IST|Sakshi

గదర్‌: ఏక్‌ ప్రేమ కథ.. బాలీవుడ్‌లోని మోస్ట్‌ ఐకానిక్‌ చిత్రాల్లో ఇది ఒకటి. సన్నీ డియోల్‌, అమీషా పటేల్‌ హీరోహీరోయిన్స్‌గా నటించారు. యాక్షన్‌ డైరెక్టర్‌ టీను వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఇప్పటి స్టార్‌ కమెడియన్‌ కపిల్‌ శర్మ కూడా నటించాడట. కానీ అతడి పార్ట్‌ను ఎడిటింగ్‌లో తీసేశారు. దానికన్నా ముందు అతడిని కొట్టి మరీ సెట్స్‌ నుంచి తరిమేశారట. ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా చెప్పుకొచ్చాడు.

'అది ఒక రైలు సన్నివేశం. సెట్స్‌లో చాలామంది ఉన్నారు. అందరూ రైలు వెంబడి పరిగెత్తాలని చెప్పాను. యాక్షన్‌ అనగానే అందరూ అదే చేశారు, ఒక్క వ్యక్తి తప్ప.. అతడే కపిల్‌. అందరూ ఒక వైపు పరిగెడుతుంటే కపిల్‌ మాత్రం రివర్స్‌లో పరిగెడుతున్నాడు. ఒకసారి చెప్పాను, రెండుసార్లు చెప్పాను. నీవల్ల పదేపదే రీటేక్‌ తీసుకోవాల్సి వస్తోంది. సరిగ్గా చేయు అని ఎన్నిసార్లు హెచ్చరించినా అతడు తీరు మార్చుకోలేదు. నేను చెప్పింది కాకుండా తనకు నచ్చింది చేశాడు. దీంతో కోపం వచ్చి కెమెరా ఆఫ్‌ చేసి కపిల్‌ వెంట పరిగెత్తి అతడి చెంప చెల్లుమనిపించాను. వెంటనే అతడిని ఇక్కడి నుంచి పంపించేయమని అక్కడున్నవాళ్లకు చెప్పడంతో వాళ్లు అతడిని బయటకు గెంటేశారు' అని చెప్పుకొచ్చాడు.


డైరెక్టర్‌ టీనూ వర్మ

ఇక ఇదే సంఘటనను కపిల్‌ శర్మ టాక్‌ షోలోనూ బయటపెట్టాడు కపిల్‌. 'డైరెక్టర్‌ చెప్పినదానికి నేను వ్యతిరేక డైరెక్షన్‌లో పరిగెత్తాను.. అలా నాకు చీవాట్లు చెంపదెబ్బలు పడ్డాయి. సినిమా రిలీజయ్యాక నేను నటించిన సీన్‌ చూపిద్దామని మా ఫ్రెండ్స్‌తో థియేటర్‌కు వెళ్లాను. కానీ తీరా నేను ఉండే సన్నివేశాన్ని తొలగించారని అర్థమైంది' అని పేర్కొన్నాడు.

చదవండి: నాకేదైనా అయితే వాళ్లే కారణం, వదిలిపెట్టొద్దు: హీరోయిన్‌
సుహాస్‌ హీరో అనగానే అవసరమా? అంటూ చీప్‌ లుక్కిచ్చారు

మరిన్ని వార్తలు