ఆ ఇంటర్వ్యూలతో టీఎన్‌ఆర్‌ దశ తిరిగింది..

10 May, 2021 17:11 IST|Sakshi

ప్రముఖ జర్నలిస్ట్‌, యాంకర్ టీఎన్‌ఆర్‌(తుమ్మల నరసింహా రెడ్డి) ఈ రోజు(మే 10) కరోనాతో కన్నుమూశారు. తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ ఎంతో పాపులర్‌ అయిన ఆయన పలు సినిమాల్లో కూడా నటించి నటుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. టీఎన్‌ఆర్‌ అనగానే మొదట గుర్తొచ్చేది ‘ఫ్రాంక్లీ విత్‌ టీఎన్‌ఆర్‌ షో’. ఈ షో ద్వారా తనదైన శైలిలో సెలబ్రేటిలను ఇంటర్వ్యూ చేసి పాపులరిటీ తెచ్చుకున్న ఆయన ఎంతోమంది యూత్‌ ఫాలోవర్స్‌ను కూడా సంపాదించుకున్నారు. గంటల తరబడి సూటిగా సుత్తి లేకుండా సహజమైన ప్రశ్నలు వేస్తూ యాంకర్‌గా ప్రత్యేక గుర్తింపును అందుకున్నారు.

ఫ్రాంక్లీ  విత్‌ టీఎన్‌ఆర్‌ షో అంటే తెలియని వారులేరు అనేంతగా ఈ షోను పాపులర్‌ చేశారు ఆయన. అంతేకాదు ఎంతసేపు చూసిన ఈ షో అసలు బోర్‌ కొట్టదు అనే పేరును కూడా తెచ్చుకుంది. అలా ప్రస్తుత డిజిటల్‌ తెలుగు మీడియా రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే యాంకర్లలో ఆయన కూడా ఒకరయ్యారు. రామ్‌ గోపాల్‌ వర్మ, తేజ వంటి స్టార్‌ డైరెక్టర్లను ఇంటర్య్వూ చేసి సెన్సేషనల్‌ అయ్యారు. అలాగే టాలెంట్ ఉన్నవారిని కూడా ఆయన బాగా సపోర్ట్ చేసేవారు. కృష్ణవంశీ, తనికెళ్ళ భరణి వంటి వారితో 4గంటలకు పైగా ఇంటర్వ్యూ చేసి టీఎన్‌ఆర్‌ రికార్డ్ క్రియేట్ చేశారు. తెలుగులో ఇంతవరకు ఎవరు కూడా అంత ఎక్కువసేపు ఇంటర్వ్యూ చేయలేదు. అంతటి ప్రత్యేకతను చాటుకున్న టీఎన్‌ఆర్‌ ఒక్క షోకి ఎంత రెమ్యూనరేషన్‌ తీసుకునేవారో తెలుసా. షో నిడివిని బట్టి ఒక్కొక్క ఇంటర్య్వూకు దాదాపు లక్ష రూపాయల నుంచి ఆపైనే పారితోషికం తీసుకునేవారని సమాచారం. 

కాగా పలు సినిమాలకు సహాయక దర్శకుడిగా వర్క్ చేసిన ఆయన ఆలీ నటించిన పిట్టల దొర సినిమాకు కూడా వర్క్ చేశారు. దర్శకుడిగా స్థిరపడాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి అనుకోకుండా మళ్ళీ టెలివిజన్‌ వైపు వచ్చారు. మొదట్లో జర్నలిజం బ్యాగ్రౌండ్‌తో పలు క్రైమ్ షోలను కూడా డైరెక్ట్ చేసిన ఆయన తర్వాత సినీ పరిశ్రమలో అడుగు పెట్టి జార్జిరెడ్డి, నేనే రాజు నేనే మంత్రి, హిట్, జాతిరత్నాలు వంటి సినిమాల్లో కూడా నటించారు. టీఎన్‌ఆర్‌ హఠాన్మరణంతో మీడియా రంగంలో, టాలీవుడ్‌ పరిశ్రమలో విషాదం నెలకొంది. 

చదవండి: 
కరోనా రక్కసికి బలైన టీఎన్‌ఆర్‌

మరిన్ని వార్తలు