అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన హీరో అడివి శేష్‌

20 Sep, 2021 15:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ఆసుపత్రిలో చేరారు. తీవ్ర అనారోగ్యానికి గురైన నటుడు హైదరాబాద్‌లో ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. కాగా గతవారం అడివి శేష్‌ డెంగ్యూ బారిన పడగా.. తాజాగా ఆయనకు రక్తంలో ప్లేట్‌లెట్స్ అకస్మాత్తుగా తగ్గిపోవడంతో సెప్టెంబర్ 18న ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శేష్‌ అనారోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు హీరో అరోగ్యం విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. 

కాగా హీరో శేష్‌ ప్రస్తుతం “మేజర్” సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘ 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో అమరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏ ప్ల‌స్ ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. దీంతోపాటు ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘గూఢచారి 2’ చేయనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. అలాగే ‘హిట్‌’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ‘హిట్‌2’లో శేష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా కనిపిస్తారట. ‘హిట్‌’ తొలి భాగాన్ని డైరెక్ట్‌ చేసిన శైలేష్‌ కొలనుయే ‘హిట్‌ 2’ను కూడా డైరెక్ట్‌ చేయనున్నారు.
చదవండి: నగరంలో వరుస హత్యలు.. రావాలి ఓ గూఢచారి
Sonu Sood: ప్రతి రూపాయి పేదల కోసమే.. ఐటీ సోదాలపై సోనూసూద్

మరిన్ని వార్తలు