రిమ్‌ జిమ్‌.. జిమ్‌..

22 Oct, 2020 00:15 IST|Sakshi
రాశీ ఖన్నా, రష్మికా మందన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌, లావణ్యా త్రిపాఠి

హీరోయిన్లు మెరుపుతీగలు. ఎప్పుడూ నాజూకుగానే ఉండాలి. స్క్రీన్‌ మీద స్లిమ్‌గా కనిపించాలి. జీరో సైజ్‌తో సందడి చేయాలి. హీరోయిన్లు అంటే ఇలానే ఉండాలని ప్రేక్షకులు ఏర్పరుచుకున్న అభిప్రాయాలు.  వాటిని నిలబెట్టుకోవడానికి హీరోయిన్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఇష్టమైన వాటికి నో చెప్పాల్సి ఉంటుంది. నోరు కట్టేసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గడానికి జిమ్‌లో బరువులు ఎత్తాల్సి ఉంటుంది. అయితే ఇవేం కష్టం కాదంటున్నారు కొందరు హీరోయిన్లు.  ఫిట్‌నెస్‌ మీద శ్రద్ధ చూపిస్తున్నారు. రిమ్‌ జిమ్‌ అంటూ ఉల్లాసంగా జిమ్‌లో కసరత్తులలో మునిగిపోయిన హీరోయిన్ల వివరాలు చూద్దాం.

‘మన శరీరాన్ని సరైన షేప్‌లో ఉంచేది మన కష్టం కాదు.. మన మెదడు. దాన్ని శ్రద్ధగా, ఫోకస్‌గా ఉంచితే ఏదైనా చేయొచ్చు. ఫోకస్‌ ఎక్కడుంటుందో ఎనర్జీ కూడా అక్కడే ఉంటుంది’ అంటారు రాశీ ఖన్నా. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను, ఫోటోలను కూడా షేర్‌ చేశారామె. ప్రస్తుతం వెయిట్‌ను కంట్రోల్‌లో పెట్టే పనిలో పడ్డారు పాయల్‌ రాజ్‌పుత్‌. 63 కేజీల నుంచి 58 కేజీల వరకూ వచ్చారట ఆమె. ‘ఈ ప్రయాణం ఎంత వరకూ సాగుతుందో చూద్దాం. మెల్లిగా అయినా నేను అనుకున్న గోల్‌ చేరతాను’ అంటూ కొత్త లుక్‌ ఫోటోలను షేర్‌ చేశారు పాయల్‌ రాజ్‌పుత్‌.

‘మన బలం, బలహీనత రెండూ మన మెదడే. దాన్ని సరిగ్గా ట్రైన్‌ చేస్తే చాలు. ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఈజీగా చేసేయొచ్చు’ అంటారు సమంత. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ చూస్తే చాలు సమంత వర్కౌట్స్‌ అస్సలు మిస్‌ కారని అర్థం చేసుకోవచ్చు. ‘మనకు 24 గంటలున్నాయి. అందులో ఒక్క గంట అయినా శరీరం మీద దృష్టి పెట్టడానికి ఉపయోగించాలి’ అంటారు రష్మికా మందన్నా. ‘శరీరాన్ని తరచూ కదిలిస్తే మనం చెప్పిన మాట వింటుంది’ అంటారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ‘ఫిట్‌నెస్‌లో కావాల్సింది స్పీడ్‌ కాదు.. శ్రద్ధ. రోజూ ఎంత శ్రద్ధగా చేస్తున్నాం అనేది ముఖ్యం’ అంటారు లావణ్యా త్రిపాఠి. వీళ్లందరూ షేర్‌ చేసిన ఫోటోలను పక్కన చూడొచ్చు.

మరిన్ని వార్తలు