Tollywood Drug Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త ట్విస్ట్‌

29 Mar, 2022 12:07 IST|Sakshi

Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌తో ప్రభుత్వ అధికారులు ముందుకొచ్చారు. ఈడీ అడిగిన అన్ని వివరాలను ఎక్సైజ్‌ శాఖ ఇచ్చేసింది. డిజిటల్ రికార్డ్స్‌, కాల్ డేటా, ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలను ఈడీకి అందజేశారు ప్రభుత్వ అధికారులు. ఈడీకి వివరాలు అందజేసినట్లు ప్రభుత్వం హైకోర్టులో మెమో దాఖలు చేసింది. దీంతో సీఎస్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌పై హైకోర్టులో వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. ఇక మళ్లీ టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు పెంచనుంది. ప్రభుత్వం, ఎక్సైజ్‌ శాఖ ఇచ్చిన డిజిటల్ రికార్డ్స్‌, కాల్‌ డేటా పరిశీలించనుంది. మరోసారి సినీ తారలను ఈడీ అధికారులు విచారించనున్నారు. డ్రగ్స్‌ లావాదేవీలు, డ్రగ్స్‌ కొనుగోళ్లు, మనీ లాండరింగ్‌పై కూపీ లాగనున్నారు. 

కాగా మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించిన నిందితులు, సాక్షుల డిజిటల్‌ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్‌ శాఖకు ఈడీ లేఖ రాసింది. హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్‌ కేసు డిజిటల్‌ డేటా ఇవ్వడం లేదని బుధవారం (మార్చి 23) ఈడీ పిటిషన్‌ వేసింది. వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆరోపిస్తుంది. సోమేష్‌ కుమార్, సర్ఫరాజ్‌కు న్యాయవాది ద్వారా ఈనెల 13న నోటీసు ఇచ్చామని ఈడీ పేర్కొంది. 

మరిన్ని వార్తలు