సోదరుడిని కోల్పోయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం
తనని అందరికి పరిచయం చేయమని అడిగేవాడు
Kiran Abbavaram Pens Emotional Post On His Brother Death: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు రామాంజులు రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. బుధవారం(డిసెంబర్ 1) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇక సోదరుడిని తలచుకుంటూ హీరో కిరణ్ అబ్బవరం ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో సోదరుడు గురించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. తన సోదరుడు గురించి కిరణ్ రాసుకొచ్చిన ఈ భావోద్వేగభరితమైన పోస్ట్ చదవుతుంటే కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.
చదవండి: టాలీవుడ్లో మరో విషాదం.. హీరో సోదరుడు మృతి
‘‘ఒరేయ్ కిరా.. మన ఊరికి సరిగ్గా రోడ్డు కూడా లేదురా. మన ఇద్దరిలో ఎవరో ఒకరం గట్టిగా సాధించాలిరా’’ అని మా అన్నయ్య రామాంజులు రెడ్డి అనేవాడు. తనకి వీలైనదానికంటే ఎక్కువగానే నన్ను సపోర్ట్ చేశాడు. తన సరదా, సంతోషాలను నా కోసం త్యాగం చేశాడు. ఇప్పుడిప్పుడే ఏదో సాధిస్తున్నానని అనుకునేలోపు తను లేకుండా పోయాడు. ‘అందరికీ నన్ను ఎప్పుడు పరిచయం చేస్తావురా?’ అని అప్పుడప్పుడు నన్ను అడిగేవాడు. ఏదైనా సాధించిన తరువాత పరిచయం చేద్దామనుకున్నా.
చదవండి: వైరల్ అవుతోన్న కమెడియన్ రఘు షాకింగ్ వీడియో!
కానీ ఇలా చేయవలసి వస్తుందని అనుకోలేదు. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ఆనందం కోసం కష్టపడేవాళ్లు ఉంటారు.. అది మీరు పొందకుండా పోతే వాళ్లు తట్టుకోలేరు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ‘రాజావారు రాణిగారు’ మూవీతో కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఆయన ఎస్ఆర్ కల్యాణ మండపం మూవీకి సొంతంగా స్క్రిప్ట్ రాసి హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో కిరణ్ అబ్బవరం ఇటూ హీరోగా, అటూ సినీ రచయితగా ఇప్పుడిప్పుడే పరిశ్రమలో నిలదొక్కుకుంటున్నాడు. ఈ క్రమంలో తన సోదరుడి హఠాన్మరణం తనకు తీరనిలోటు అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు.