Tollywood Heroines: లాయర్‌ అవతారం ఎత్తిన హీరోయిన్లు, ఎవరెవరంటే?

20 Feb, 2022 08:08 IST|Sakshi

నల్ల కోటు ధరించారు.. ఒత్తయిన కురులను ముడిలా బిగించారు.. న్యాయం కోసం నడుం బిగించారు. యువరానర్‌ అంటూ వాదన వినిపించడానికి రెడీ అయ్యారు. అందాల తారలు ఇలా పవర్‌ఫుల్‌గా కనబడితే చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. లాయర్లుగా కనిపించనున్న ఆ తారలు చేస్తున్న సినిమాల్లోకి ఓ లుక్కేద్దాం.

ఎప్పటికప్పుడు క్యారెక్టర్స్‌ మధ్య వేరియేషన్స్‌ చూపిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటారు హీరోయిన్‌ కీర్తీ సురేష్‌. ‘మహానటి’ వంటి బయోపిక్‌ కావొచ్చు, ‘గుడ్‌లక్‌ సఖి’ వంటి స్పోర్ట్స్‌ డ్రామా కావొచ్చు, ప్రస్తుతం మహేశ్‌బాబు సరసన చేస్తున్న కమర్షియల్‌ ఫిల్మ్‌ ‘సర్కారువారి పాట’ చిత్రంలోని కళావతి పాత్ర కావొచ్చు... క్యారెక్టర్‌ ఏదైనా అందులో పూర్తిగా ఒదిగిపోతారు. తాజాగా కీర్తి లాయర్‌గా మారారు. కోర్టులో ప్రత్యర్థి లాయర్‌ను ఆమె ఎలా ముప్పుతిప్పలు పెడతారో ‘వాషి’ చిత్రంలో చూసి తెలుసుకోవాల్సిందే. కీర్తి లాయర్‌గా నటిస్తున్న మలయాళ చిత్రం ఇది. త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం కీర్తి లుక్‌ని విడుదల చేశారు.

ఇక కీర్తీ సురేష్‌ అన్నయ్యకు ఓ లాయర్‌గా హెల్ప్‌ చేయాలనుకుంటున్నారు తమన్నా. కీర్తి అన్నయ్యకు తమన్నా సహాయం చేయడమేంటీ అనుకుంటున్నారా? కీర్తి ఆన్‌ స్క్రీన్‌ అన్నయ్య చిరంజీవి తరఫున లాయర్‌గా తమన్నా వాదించనున్నారట. చిరంజీవి హీరోగా మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ‘బోళా శంకర్‌’ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్‌ నటిస్తున్నారు. లాయర్‌ పాత్రలో తమన్నా నటించనున్నారని తెలిసింది. ‘బోళాశంకర్‌’ చిత్రం తమిళంలో అజిత్‌ చేసిన ‘వేదాళం’కు తెలుగు రీమేక్‌ అనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘వేదాళం’లో హీరోయిన్‌గా నటించిన శ్రుతీహాసన్‌ లాయర్‌ పాత్రలో కనిపించారు. సో.. ‘బోళా శంకర్‌’లో తమన్నా లాయర్‌గా కనిపిస్తారని ఊహించుకోవచ్చు.

మరో బ్యూటీ రాశీ ఖన్నా కూడా లా సెక్షన్స్‌ను గుర్తుపెట్టుకునే పనిలో ఉన్నారు. ఎందుకంటే ‘పక్కా కమర్షియల్‌’ కోసం. గోపీచంద్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘పక్కా కమర్షియల్‌’ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో రాశీ ఖన్నా లాయర్‌గా కనిపిస్తారని తెలిసింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే 20న విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు 2009లో వచ్చిన ‘ఎవరైనా ఎపుడైనా’ చిత్రంతో టాలీవుడ్‌ గడప తొక్కారు హీరోయిన్‌ విమలా రామన్‌. ఆ తర్వాత ‘గాయం 2’, ‘రాజ్‌’, ‘చట్టం’ వంటి సినిమాల్లో నటించారు. కానీ తెలుగులో విమలా రామన్‌ కెరీర్‌ ఆశించినట్లుగా సాగలేదు. కానీ మలయాళంలో హిట్‌. తాజాగా ఆమె ఓ మలయాళం చిత్రంలో లాయర్‌గా నటిస్తున్నారు. తన లాయర్‌ లుక్‌ను విమలా షేర్‌ చేశారు.

అటు హిందీకి వెళితే... అక్కడ కూడా ఓ లాయరమ్మ రెడీ అవుతున్నారు. తమిళ బంపర్‌ హిట్‌ మూవీ ‘విక్రమ్‌వేదా’ హిందీ రీమేక్‌లో రాధికా ఆప్టే లాయర్‌ పాత్ర చేయనున్నారని టాక్‌. తమిళంలో ఇన్‌స్పెక్టర్‌ విక్రమ్‌గా మాధవన్, గ్యాంగ్‌స్టర్‌ వేదగా విజయ్‌ సేతుపతి నటించగా, ప్రియ అనే లాయర్‌ పాత్రను పోషించారు శ్రద్ధా శ్రీనాథ్‌. తమిళంలో తీసిన పుష్కర్‌ గాయత్రి దర్శక ద్వయమే హిందీ రీమేక్‌ని తెరకెక్కిస్తున్నారు. రీమేక్‌లో విక్రమ్‌ పాత్రలో సైఫ్‌ అలీఖాన్, వేద పాత్రలో హృతిక్‌  రోషన్‌ కనిపిస్తారు. అలాగే ఈ చిత్రంలో సైఫ్‌ భార్య అంటే లాయర్‌గా హీరోయిన్‌ రాధికా ఆప్టే కనిపించనున్నారట. వీరితో పాటు మరికొందరు నాయికలు న్యాయం కోసం కోర్టులో వాదించేందుకు లాయర్లుగా రెడీ అవుతున్నారు.

మరిన్ని వార్తలు