గూగుల్‌ సీఈవోకు టాలీవుడ్‌ నిర్మాత బన్నీవాసు లేఖ

25 Jul, 2021 14:41 IST|Sakshi

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కి టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు లేఖ రాశాడు. సామాజిక మాద్యమాల్లో తప్పుడు ప్రచారం వల్ల తన కుమార్తె, తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించినట్లు లేఖలో వెల్లడించారు. తన కూతురిని చంపుతానని ఓ వ్యక్తి సామాజిక మాద్యమాల్లో వీడియో పెడితే.. దాన్ని తీయించడానికి తల ప్రాణం తోకకు వచ్చిందని, చిత్ర పరిశ్రమలో ఎంతో కొంత పలుకుబడి ఉన్న తనకే ఇంత కష్టమైతే.. సామాన్యుల పరిస్థితి ఏంటని నేరుగా సుందర్‌ పిచాయ్‌ని ప్రశ్నించారు బన్నీవాసు.

ఒకరు పెట్టిన పోస్టు అబద్ధమని నిరూపించడం చాలా కష్టతరం అని, అదేంటో స్వయంగా తాను ఫేస్‌ చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్నెట్‌ స్వేచ్ఛకు మద్దతుగా ఇటీవల గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ  బన్నీ వాసు ఈ లేఖ రాశారు. ప్రస్తుతం బన్నీ వాసు లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ఇక సినిమాల విషయానికి వస్తే బన్నీ వాసు ప్రస్తుతం అఖిల్‌ హీరోగా  ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా షూట్‌ ఇటీవల పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు