Tollywood: టాలీవుడ్‌ నిర్మాతల సంచలన నిర్ణయం, కొత్త నిబంధనలివే!

26 Jul, 2022 18:00 IST|Sakshi

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి సినిమా చిత్రీకరణలను తాత్కాలికంగా బంద్ చేయాలని భావిస్తోంది. సినిమా చిత్రీకరణలు నిలిపివేసి సమస్యలపై నిర్మాతలంతా కలిసి చర్చించాలని తీర్మానించింది. అలాగే ఓటీటీ రిలీజ్‌లపైనా పలు నిర్ణయాలు తీసుకుంది. భారీ బడ్జెట్‌ చిత్రాలను పది వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్‌ చేయాలని నిర్ణయించింది. పరిమిత బడ్జెట్‌లో తీసిన చిత్రాలను నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేసుకోవచ్చని చెప్పింది. అలాగే రూ.6 కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మించిన సినిమాల ఓటీటీ రిలీజ్‌ విషయంపై ఫెడరేషన్‌తో చర్చించాకే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

మంగళవారం నాడు అన్నపూర్ణ స్టూడియోలో ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీలో 25 మంది నిర్మాతలు పాల్గొన్నారు. ఓటీటీలో కొత్త సినిమాలు, నటీనటుల పారితోషికాలు, కార్మికుల వేతనాలపై సుమారు గంటపాటు చర్చించిన అనంతరం.. సినిమా ప్రదర్శన కోసం చెల్లించే వీపీఎఫ్ ఛార్జీలను ఎగ్జిబిటర్లే చెల్లించాలని ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ నిర్ణయించింది. సామాన్యులకు టికెట్ ధరలను అందుబాటులో ఉంచాల్సిందేనని స్పష్టం చేసింది. సాధారణ థియేటర్లు, సి-క్లాస్ సెంటర్లలో టికెట్ ధరలు రూ.100, రూ.70 రూపాయలు ఉండేలా ప్రతిపాదనలు ముందు పెట్టింది. మల్టీఫ్లెక్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.125, రూ.150 ఉండేలా ప్రతిపాదనలు చేసింది. 

ఫిలిం చాంబర్, నిర్మాతల మండలితో చర్చించాకే సినిమా నిర్మాణ వ్యయాలు పెంచుకోవాలని సూచించింది. ఫిలిం చాంబర్ నిర్ణయించిన రేట్ కార్డ్ నే షూటింగ్ ప్రదేశాల్లో నిర్మాతలు అమలు చేయాలని ఆదేశించింది. నిర్మాతలను తప్పుదోవ పట్టిస్తున్న మేనేజర్లు, కోఆర్డినేటర్ల వ్యవస్థను తొలగించాలని మండిపడింది. నిర్ణీత సమయానికల్లా నటీనటులు షూటింగ్స్‌కు హాజరయ్యేలా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సూచించింది. నిర్దేశించిన సమయానికల్లా చిత్రీకరణ పూర్తి చేయాలని తెలిపింది. నటీనటుల సహాయకులకు వసతులు, ఇతర సౌకర్యాలు కల్పిస్తే పారితోషకంలో కోత విధించాల్సిందేనని పేర్కొంది.

చదవండి: రణ్‌వీర్‌ సింగ్‌ను అనుకరించిన నటుడు, నిజంగానే అంత సాహసం చేశాడా?
హోంటూర్‌ వీడియోను షేర్‌ చేసిన యాంకర్‌ శ్యామల

మరిన్ని వార్తలు