బన్నీ నుంచి అఖిల్‌ దాకా.. బాక్సాఫీస్‌ దగ్గర సందడి చేయని హీరోలెవరంటే?

22 Dec, 2022 20:52 IST|Sakshi

సినిమా చూపిస్త మామా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోలు కొందరైతే గ్యాప్‌ తీసుకోలేదు భయ్యా, అదే వచ్చింది అంటూ బాక్సాఫీస్‌కు దూరంగా ఉన్న హీరోలు మరికొందరు. ఏడాదికొక్క సినిమా అంటూ లెక్కలేసుకోకుండా వరుస సినిమాలతో కొందరు జోరు చూపిస్తుంటే ఈ సంవత్సరం నో మూవీ అంటూ ఉసూరుమనిపించారు మరికొందరు కథానాయకులు. ఇంతకీ ఏయే హీరోలు ఈ ఏడాది థియేటర్లలో కనిపించి అభిమానులతో విజిల్స్‌ కొట్టించారు? ఎవరు అసలు కనిపించకుండా పోయి ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్‌ చేశారో ఈ స్పెషల్‌ స్టోరీలో చూసేద్దాం..

బ్రేక్‌ ఇచ్చిన బాలయ్య
గతేడాది అఖండతో రికార్డులు బద్ధలు కొట్టాడు బాలయ్య. ఏకంగా వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయి సెన్సేషన్‌ అయ్యాడు. కానీ ఈ ఏడాది అతడు బాక్సాఫీస్‌ను పలకరించనేలేదు. అతడు నటించిన వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఏమాటకామాటే కానీ.. బాలయ్య సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించకపోయినా ఆహా అన్‌స్టాపబుల్‌ రెండో సీజన్‌ ద్వారా అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు.

భారీ ప్లానింగ్‌లో అల్లు అర్జున్‌
పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా లెవల్‌లో అదరగొట్టిన అల్లు అర్జున్‌ ఈ ఇయర్‌ మాత్రం గప్‌చుప్‌గా ఉన్నాడు. నిజానికి పుష్ప సీక్వెల్‌ను కూడా ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. కానీ పుష్ప ఫస్ట్‌ పార్ట్‌ ఊహించనంత విజయం అందుకోవడంతో సెకండ్‌ పార్ట్‌ కథపై భారీ కసరత్తులు చేశారు. దీంతో ఎప్పుడో ప్రారంభం కావాల్సిన పుష్ప: ద రూల్‌ షూటింగ్‌ ఈ మధ్యే మొదలైంది. ఈ సినిమా నెక్స్ట్‌ ఇయర్‌ రిలీజ్‌ కానుంది.

స్లో అయిన సాయిధరమ్‌ తేజ్‌
మొదట్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయిన మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఈ ఏడాది బొణీ కొట్టలేదు. గతేడాది తేజ్‌కు యాక్సిడెంట్‌ కావడంతో ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకున్నాడు. అలా అతడి సినిమాల రిలీజ్‌ ఆలస్యం కానున్నాయి. ప్రస్తుతం అతడు కార్తీక్‌ దండు డైరెక్షన్‌లో ఓ మూవీ, జయంత్‌ పనుగంటి దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నాడు.

కనిపించని అఖిల్‌
పోయిన సంవత్సరం మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌తో ప్రేక్షకులను పలకరించాడు అక్కినేని అఖిల్‌. ప్రస్తుతం అతడు సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో ఏజెంట్‌ సినిమా చేస్తున్నాడు. ఇది ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ సినిమా షూటింగ్‌ ఆలస్యం కావడంతో వచ్చే ఏడాదికి వాయిదా పడింది.

చదవండి: ఓటీటీ ప్రేక్షకులను అలరించే చిత్రాలివే!

మరిన్ని వార్తలు