9 మంది హీరోలు.. 8000 కోట్ల దందా

27 Apr, 2023 10:43 IST|Sakshi

టాలీవుడ్‌ సినిమా ఇండియన్‌ సినిమాకి దిక్సూచిగా మారింది. `బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రాలు తెలుగు సినిమా సత్తాని చాటాయి. ఈ చిత్రాలు బాగా ఆడటంతో తెలుగు సినిమా రేంజ్‌ పెరిగింది. భారీ బడ్జెట్‌ చిత్రాలు ఊపందుకున్నాయి. స్టార్‌ హీరోలపై వందల కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి నిర్మాతలు వెనకాడటం లేదు. దీంతో ఇప్పుడు మెయిన్‌ స్టార్‌ హీరోలపై వేల కోట్ల బిజినెస్‌ జరుగుతుంది. ముఖ్యంగా మన తెలుగు హీరోల్లో.. ప్రభాస్‌, పవన్‌, బన్నీ, చరణ్‌, ఎన్టీఆర్‌, మహేష్‌, చిరు, బాలయ్య, రవితేజ వంటి తొమ్మిది మంది స్టార్స్ పై ఏకంగా ఎనిమిది వేల కోట్ల దందా జరుగుతుండటం విశేషం. 

టాలీవుడ్‌లో జరుగుతున్న మొత్తం బిజినెస్‌లో సగం కేవలం ప్రభాస్‌ పైనే కావడం విశేషం. ఆయన పేరుతో ఇప్పుడు నాలుగువేల కోట్ల దందా నడుస్తుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ వివరాలు చూస్తే.. ప్రస్తుతం ప్రభాస్‌ `ఆదిపురుష్‌`, `సలార్‌`, `ప్రాజెక్ట్ కే`తోపాటు `సూపర్‌ డీలక్స్`(వినిపించే పేరు) చిత్రాల్లో నటిస్తున్నారు ప్రభాస్‌. ఇందులో ఓ రౌత్‌ రూపొందిస్తున్న `ఆదిపురుష్‌` బడ్జెట్‌ ఐదువందల కోట్లు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పుడు 7 నుంచి 8 వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది. కలెక్షన్ల టార్గెట్‌ కూడా సుమారు అంతే ఉంటుందని టాక్‌.

(చదవండి: నాన్న చనిపోతే వాళ్లు తప్ప చూసేందుకు ఎవరూ రాలేదు: కమెడియన్‌ కొడుకు)

దీంతోపాటు`కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో చేస్తున్న భారీ యాక్షన్‌ మూవీ `సలార్‌` బడ్జెట్‌ సుమారు రూ.350కోట్లు, దీనిపై జరుగుతున్న బిజినెస్‌ ఎనిమిది వందల కోట్లు, కలెక్షన్ల టార్గెట్‌ 1200-1500కోట్లు కావడం విశేషం. ఇక ప్రభాస్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం `ప్రాజెక్ట్ కే`. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దీన్ని భారీ యాక్షన్‌ సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిస్తున్నారు. సూపర్‌ హీరో అంశాలను జోడించి టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారని టాక్‌. ఆఈ సినిమా బడ్జెట్‌ రూ.500-600కోట్లు. ఈ సినిమాపై వ్యాపారం వెయ్యి కోట్లకుపైగానే జరుగుతుంది. కలెక్షన్ల టార్గెట్‌ మాత్రం రూ.2వేల కోట్లు.

(చదవండి: నా కూతురి విషయంలో రణ్‌బీర్‌ భయం అదే : అలియా భట్‌)

దీన్ని ఇంటర్నేషనల్‌ రేంజ్‌లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీంతోపాటు ఓ చిన్న సినిమా చేస్తున్నారు ప్రభాస్‌. మారుతి దర్శకత్వంలో `సూపర్‌ డీలక్స్‌` పేరుతో ఓ ఎంటర్‌టైనింగ్‌ మూవీ చేస్తున్నారు. సుమారు రెండువందల యాభై కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా బిజినెస్‌, కలెక్షన్ల టార్గెట్‌ ఐదు వందల కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ప్రభాస్‌ పేరుతోనే ఆల్మోస్ట్ 4వేల కోట్లకుపైగా వ్యాపారం జరుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఓ రకంగా డార్లింగ్‌ ఇప్పుడు ఇండియన్‌ సినిమాని శాసిస్తున్నారని చెప్పొచ్చు. 

ప్రభాస్‌ తర్వాత ఇప్పుడు అత్యధికంగా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పేరుతో నడుస్తుంది. నిజానికి ఆయన సినిమాలు కలెక్షన్లు, బిజినెస్‌ లెక్కల్లో ఉండవు. కానీ ఈ సారి మాత్రం ఆయన సినిమాలపై వేల కోట్ల వ్యాపారం జరుగుతుండటం విశేషం. పవన్‌ ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నారు. అందులో `హరిహరవీరమల్లు`, `వినోదయ సీతం` రీమేక్‌, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`, `ఓజీ` సినిమాలున్నాయి.  ఈ పవన్‌ నాలుగు సినిమాలపై ఏకంగా 1200-1500-కోట్ల వ్యాపారం జరగబోతుందని ట్రేడ్‌ వర్గాల అంచనా.

ఆ తర్వాత ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నిలుస్తారు. ప్రస్తుతం ఆయన సుకుమార్‌ దర్శకత్వంలో `పుష్ప2` చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్‌ మూడు వందల కోట్ల వరకు ఉంటుందని సమాచారం. బిజినెస్‌ టార్గెట్‌ మాత్రం 600-700కోట్ల వరకు ఉంటుంది. కలెక్షన్ల టార్గెట్‌ వెయ్యి కోట్ల వరకు అంచనా వేస్తున్నారు. మొదటి భాగం భారీ బ్లాక్‌ బస్టర్‌ కావడంతో రెండో పార్ట్ పై ఆసక్తి ఏర్పడింది. ఇటీవల విడుదలైన మూడు నిమిషాల టీజర్‌ గూస్‌బంమ్స్ తెప్పించింది. సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. దీంతో వ్యాపారం కూడా భారీగానే జరగబోతుందన్నట్టు సమాచారం. 

`ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్‌ రామ్‌చరణ్‌ సైతం ఈ రేస్‌లో నిలిచారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`తో పాన్‌ ఇండియా స్టార్‌ నుంచి గ్లోబల్‌ స్టార్‌ ట్యాగ్‌ని తగిలించుకున్న చెర్రీ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో నటిస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా సుమారు రూ.350-400కోట్ల బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటోంది. దీనిపై ఐదు వందల కోట్ల వ్యాపారం జరగబోతుంది. ఈ సినిమా నుంచి 600-700కోట్ల కలెక్షన్లని ఆశిస్తున్నారు నిర్మాత దిల్‌రాజు. ఆయన బిజినెస్‌ చేయడంలో దిట్ట. అంతకు మించి బిజినెస్‌ చేసినా ఆశ్చర్యం లేదు.
.

మరో `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్‌ ఎన్టీఆర్‌ సైతం ఈ లీగ్‌లోనే ఉన్నారు. ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో పీరియాడికల్‌ యాక్షన్‌ నేపథ్యంలో `ఎన్టీఆర్‌ 30`మూవీ చేస్తున్నారు. కోస్టల్‌ ఏరియాలో గుర్తింపుకి, ఆదరణకు నోచుకోని, దూరంగా నెట్టివేయబడ్డ ప్రాంతం కథతో రా అండ్‌ రస్టింగ్‌ గా ఈ మూవీ సాగుతుందట. ఈ సినిమా బడ్జెట్‌ రూ250-300కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

ఈ లెక్కన ఈ సినిమాపై 400-500కోట్ల బిజినెస్‌ని ఐదారు వందల కోట్ల కలెక్షన్లని ఆశిస్తున్నారు. పాన్‌ ఇండియాని మించి ఈ సినిమాని ప్లాన్‌ చేస్తున్నారు కొరటాల. దీనికి హాలీవుడ్‌ టెక్నీషియన్లు పనిచేస్తున్న విషయం తెలిసిందే. రిలీజ్‌ టైమ్ కి ఈ లెక్కలు మారిపోయే అవకాశం ఉంది.
 

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కూడా ఐదు వందల కోట్లని టార్గెట్‌ చేశారు. ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో `ఎస్‌ఎస్‌ఎంబీ28` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా సుమారు రూ.200కోట్ల బడ్జెట్‌తో రూపొందుతుంది. ఈ సినిమాపై ఈజీగా మూడు వందల కోట్ల బిజినెస్‌ జరుగుతుంది. 350-400 కోట్ల వరకు కలెక్షన్లని ఆశిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్‌ చేస్తే ఐదు వందల కోట్ల వరకు టార్గెట్‌ చేసే అవకాశం ఉంది. ఇలా ప్రధానంగా ఈ ఆరుగురు హీరోలపైనే ఏడువేల కోట్ల వ్యాపారం జరుగుతుందని చెప్పొచ్చు. 

వీరితోపాటు రెండువందలకోట్లకుపైగా బిజినెస్‌ టార్గెట్‌తో చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ వంటి వారు వస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం `భోళాశంకర్‌` చిత్రంలో నటిస్తున్నారు. 150కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా నుంచి సుమారు రెండు వందల కోట్ల వరకు ఆశిస్తున్నారు. అలాగే సుమారు రూ.70-80కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న బాలయ్య, అనిల్‌ రావిపూడి మూవీ `ఎన్బీకే108`  కలెక్షన్ల టార్గెట్ కూడా రెండు వందల కోట్లు ఉంటుంది.

అలాగే రవితేజ ప్రస్తుతం `టైగర్‌ నాగేశ్వరరావు` అనే పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి 200-250కోట్ల వరకు కలెక్షన్లని ఆశిస్తున్నారు. ఇలా ఈ తొమ్మిది మంది హీరోలపైనే ఎనిమిది వేల కోట్ల వరకు సినిమా దందా నడుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

వీరితోపాటు మిగిలిన యంగ్‌ హీరోల సినిమాలపై వ్యాపారం ఈజీగా మరో 1500కోట్లకుగానే ఉంటుంది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం టాలీవుడ్‌ హీరోలపై పదివేల కోట్ల వ్యాపారం జరుగుతుందని చెప్పొచ్చు. ఇలా అత్యధిక సినిమా వ్యాపారంతో టాలీవుడ్‌ ఇండియాలోనే టాప్‌లో నిలిచిందని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరిన్ని వార్తలు