ఏపీ సీఎం జ‌గ‌న్‌తో చ‌ర్చిస్తాం: టాలీవుడ్ పెద్ద‌లు

24 Nov, 2020 19:03 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్‌: టాలీవుడ్ మీద వ‌రాల జ‌ల్లు కురిపించిన తెలంగాణ ప్ర‌భుత్వానికి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ధ‌న్య‌వాదాలు తెలిపింది. టాలీవుడ్‌కు సంబంధించిన వివిధ శాఖల ఆధ్వర్యంలో ఫిలిం ఛాంబర్‌లో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన ప్రెస్ మీట్‌లో ప‌లు అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ... సినీ పరిశ్రమకు రాయితీలు ప్రకటించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి కార‌కులైన‌ చిరంజీవి, నాగార్జునకు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్ర‌భుత్వం ఇచ్చిన జీవోలను అందరం చర్చించుకొని అమ‌లు చేస్తామ‌న్నారు. ఏపీలో కూడా కొన్ని సమస్యలు వున్నాయ‌ని, వాటి పైన కూడా చ‌ర్చ‌లు జ‌రిపి రెండు మూడు రోజుల్లో థియేటర్స్ ఎప్పుడు తెరుస్తామనే విష‌యాన్ని వెల్ల‌డిస్తామ‌ని పేర్కొన్నారు. (చ‌ద‌వండి: సినీ పరిశ్రమను కాపాడుకుంటాం: కేసీఆర్‌)

తెలుగు ఇండస్ట్రీకి ఇద్దరు నాన్నలు
నిర్మాతల మండలి అధ్యక్షుడు కళ్యాణ్ మాట్లాడుతూ.. 'జీహెచ్ఎంసీ మేనిఫెస్టోలో సినిమా వాళ్లకు కొన్ని రాయితీలు ప్రకటించారు. దీనికోసం చిరంజీవి నాగార్జున, మంత్రి తలసాని చొరవ తీసుకున్నారు. ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి మాతో రెండున్నర గంటలు మాట్లాడారు. రోజుకు ఎక్కువ షో లు వేసుకొనే విధంగా అనుమతి ఇచ్చారు. ఇది దేశంలో ఒక్క తెలంగాణాలో మాత్రమే వుంది. దీని వల్ల చాలా చిన్న సినిమాలు వస్తాయి. ఫలితంగా ఉపాధి కూడా పెరుగుతుంది. ఇక‌ తెలుగు ఇండస్ట్రీకి ఇద్దరు నాన్నలు.. ఒకరు కేసీఆర్, మ‌రొక‌రు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి. సినీ ఇండస్ట్రీ గురించి ఏపీ సీఎం జగన్ గారితో కూడా చర్చిస్తాం. మా ఇండస్ట్రీ తరుపున పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసి ఇద్దరు సీఎంలను  ఆహ్వానించి, కృతజ్ఞతలు తెలుపుతాము' అని చెప్పుకొచ్చారు. సినీ ఇండ‌స్ట్రీ కోసం రాయితీలు ప్ర‌క‌టించిన కేసీఆర్‌కు మా అసోసియేషన్ సెక్రెటరీ జీవిత, డైరెక్టర్స్ అధ్యక్షుడు ఎన్.శంకర్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. (చ‌ద‌వండి: మాయలు మంత్రాలు అంటే ఆసక్తి ఉండేదట)

>
మరిన్ని వార్తలు