Tollywood Heroines: దక్షిణాదిలో స్టార్ హీరోయిన్స్.. అక్కడ చూస్తే సీన్ రివర్స్!

4 May, 2023 14:01 IST|Sakshi

ప్రస్తుతం దక్షిణాది చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతుంటే బాలీవుడ్‌ మాత్రం అపజయాలతో సతమతమవుతోంది. ఇటీవల షారూఖ్‌ ఖాన్‌, దీపికా పదుకొణే జంటగా నటించిన పఠాన్‌ చిత్రం సంచలన విజయం సాధించింది. వరుస అపజయాలతో సతమతమవుతున్న బాలీవుడ్‌కు ఊపిరి పోసిందనుకుంటే ఆ తరువాత మళ్లీ పరిస్థితి షరా మామూలుగానే మారింది. 

ఇక ఈ విషయాన్ని పక్కనపెడితే దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్లుగా పేరున్న వారంతా తమ గోల్‌ బాలీవుడ్‌గానే భావిస్తున్నారు. ఇంతకు ముందు నటి శ్రీదేవి, జయప్రద వంటి వారు బాలీవుడ్‌లో సక్సెస్‌ అయ్యారు. అదే బాటలో ఇప్పుడు నటి రష్మిక మందన్నా, రాశీఖన్నా, పూజాహెగ్డే వంటి వారు బాలీవుడ్‌ పిలుపుతో అక్కడికి పరుగు పెడుతున్నారు. అయితే వీరి పరిస్థితి రివర్స్‌ గేర్‌ను తలపిస్తోంది.

(ఇది చదవండి: సీనియర్ నటుడు శరత్ బాబుపై అసత్య వార్తలు.. సోదరి క్లారిటీ)

అక్కడ వీరంతా ఒక్క హిట్‌ కోసం ఆరాటపడాల్సిన పరిస్థితిని ఎదుర్కొవాల్సి వస్తోంది. నటి రాశీఖన్నా బాలీవుడ్‌లో కొన్ని చిత్రాల్లో నటించింది. అదే విధంగా నటి పూజాహెగ్డే ఇటీవల నటించిన చిత్రాలన్నీ వరుసగా అపజయం పాలవుతున్నాయి. నటి రష్మిక మందన్నా విషయానికి వస్తే అక్కడ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించిన గుడ్‌బై చిత్రం ఆమెను పూర్తిగా నిరాశ పరిచింది. 

ఈ తరువాత అక్షయ్‌కుమార్‌తో జత కట్టిన చిత్రం ప్లాప్‌ అయ్యింది. ఇలా వరుసగా రెండు చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకపోవడం రష్మిక కెరీర్‌కు దెబ్బ తీసిందనే ప్రచారం జరుగుతోంది. కాగా ప్రస్తుతం నటిస్తున్న యానిమల్‌ చిత్రం పైనే ఈ అమ్మడు ఆశలు పెట్టుకుంది. మరిన్ని అవకాశాల కోసం సామాజిక మాధ్యమాలను వేదికగా ఎంచుకున్నట్లుంది. 

స్పెషల్‌ ఫొటో సెషన్లతో రకరకాల ఫొటోలను తీయించుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తోంది. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. అలా ఇక్కడ టాప్‌ హీరోయిన్లుగా రాణిస్తున్న నటీమణులు బాలీవుడ్‌ అచ్చిరావడం లేదనే ప్రచారం జోరుందుకుంది. కాగా ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్‌ సరసన పుష్ప– 2, నితిన్‌తో ఓ చిత్రం చేస్తోంది.

(ఇది చదవండి: స్డేడియంలో వాలిపోయిన ప్రేమజంట.. సోషల్ మీడియాలో వైరల్)

మరిన్ని వార్తలు