Bollywood Celebrities In Trouble: 2021లో వివాదాల్లో చిక్కుకున్న బాలీవుడ్‌ తారలు వీరే..

21 Dec, 2021 09:16 IST|Sakshi

Top 6 Bollywood Celebrities Who Landed In Trouble: 2021 సంవత్సరం ఇంకో 10 రోజుల్లో ముగియనుంది. ఈ ఏడాది బాలీవుడ్ తారలు తమ చిత్రాలతో కనులవిందు చేశారు. అలాగే కొంతమంది సెలబ్రిటీలు పలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచారు. కొందరైతే ఏకంగా అరెస్టయి కొన్ని రోజులు జైలులో గడపవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. వారిలో బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ నుంచి నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా వరకు ఉన్నారు. ఇలా ఈ ఏడు వివిధ రకాల సంఘటనలతో బీటౌన్‌ ఆసక్తికరంగా మారింది. 2021లో పలు వివాదాల్లో చిక్కుకుని కష్టాలు కొనితెచ్చుకున్న బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరెవరో చూద్దాం. 

1. ఆర్యన్‌ ఖాన్‌
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) కస్టడికీ వెళ్లడంతో బీటౌన్‌ షాక్‌ అయింది. క్రూయిజ్‌ షిప్‌లో జరిగిన పార్టీలో ఎన్‌సీబీ (NCB) డ్రగ్‌ రైడ్‌ తర్వాత ఈ స్టార్‌ కిడ్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. అక్టోబర్‌ 2న జరిగిన ఈ దాడిలో ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అనంతరం ఆర్యన్‌ను ఆర్థర్‌ రోడ్‌ జైలుకు తరలించారు. సుమారు 20 రోజులు జైలులో గడిపిన తర్వాత ఈ స్టార్‌ కిడ్‌కు బెయిల్ మంజూరైంది. 

2. రాజ్‌ కుంద్రా
బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా అశ్లీల చిత్రాలను రూపొందించి మొబైల్‌ యాప్స్‌ ద్వారా ప్రచురించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ కేసు విషయంలో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. 'అశ్లీల చిత్రాలను రూపొందించడం, వాటిని కొన్ని యాప్‌లు ద్వారా ప్రచురించడంపై ఫిబ్రవరి 2021లో కేసు నమోదైంది. ఈ కేసులో రాజ్‌కుంద్రా ప్రధాన సూత్రధారిగా కనిపిస్తున్నందున జూలై 19, 2021న అరెస్టు చేశాము. దీనికి తగిన ఆధారాలు మా వద్ద ఉన్నాయి. దర్యాప్తు కొనసాగుతోంది.' అని ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన సీపీ ప్రకటించారు. సుమారు రెండు నెలలపాటు పోలీసు కస్టడీలో ఉన్న రాజ్‌ కుంద్రాకు సెప్టెంబర్‌లో బెయిల్ వచ్చింది. అలాగే ఓ వ్యాపారిని మోసం చేసిన కేసులో శిల్పా శెట్టి కూడా ఆరోపణలు ఎదుర్కొంది.

3. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌
మనీ లాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్‌ చంద్రశేఖర్‌ కేసులో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ పేరు వినిపించడంతో ఆమె వార్తల్లో నిలిచింది. ఈ కేసులో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు సమన‍్లు జారీ చేసిన ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. అయితే, రూ.10కోట్ల విలువైన బహుమతులు సుకేష్ నుంచి తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంది జాక్వెలిన్‌. సుకేష్‌ చంద్రశేఖర్‌ నుంచి పలు ఖరీదైన బహుమతులు పొందినట్లు హాట్‌ బ్యూటీ నోరా ఫతేహీ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. 

4. అనన్య పాండే
ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసు విచారణలో బాగంగా లైగర్‌  బ్యూటీ అనన్య పాండేకు ఎన్‌సీబీ (NCB) సమన్లు జారీ చేసింది. ఆర్యన్‌ ఖాన్‌ వాట్సాప్‌ చాట్స్‌లో తన పేరు బయటకు రావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది అనన్య. ఆర్యన్‌ ఖాన్‌కు, ఒక డెబ్యూ హీరోయిన్‌ మధ్య ఉన్న వాట్సాప్‌ చాట్‌ను కనిపెట్టినట్లు ఎన్‌సీబీ వారి ప్రకటనలో తెలిపింది. అయితే ఆ సమయంలో ముందుగా ఆ పేరును ఎన్‌సీబీ వెల్లడించలేదు. 

5. కంగనా రనౌత్‌
ఎప్పుడూ ఆసక్తికర,  విదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది కంగనా రనౌత్‌. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగన పర్హాన్‌ అక్తర్‌కు పరువుకు నష్టం కలిగించే రీతిలో మాట్లాడిందని పర్హాన్ తండ్రి జావేద్‌ అక్తర్‌ పరువు నష్టం కేసు దాఖలు చేశాడు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ కంగనా బాంబే హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం తిరస్కరించింది. అలాగే కోర్టు ఫిబ్రవరిలో కంగనాను కోర్టుకు హాజరుకావలసిందిగా నోటీసు జారీ చేసింది. కంగనా చాలాసార్లు విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్‌తో హెచ్చరించింది.

6. ఐశ్వర్య రాయ్ బచ్చన్‌
ఐదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పనామా పేపర్స్‌’ కేసులో బాలీవుడ్‌ నటి ఐశ్వర్యా రాయ్‌ బచ్చన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సమన్లు జారీ చేశారు. అనంతరం ఈడీ ఎదుట హాజరైన ఐశ్వర్యను సుమారు ఆరు గంటలపాటు పలు ప్రశ్నలు అడిగారు అధికారులు. ఈ సందర్భంగా అధికారులకు ఐశ్వర్య పలు డాక్యుమెంట్లను అందజేశారు. ఫారెన్‌ ఎక్సే్చంజ్‌ మేనేజ్‌మెంట్‌ (ఫెమా) చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై కొనసాగుతున్న కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ఐశ్వర్య వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఈ పనామా పేపర్స్‌ లీక్‌ కేసుకు సంబంధించి బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, అభిషేక్ బచ్చన్‌ను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. 

ఇదీ చదవండి:  ఐశ్వర్య రాయ్‌కు ఈడీ సమన‍్లు.. ఎందుకంటే ?

మరిన్ని వార్తలు