Trisha : ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న త్రిష.. ఇప్పటికీ అదే క్రేజ్‌

15 Dec, 2022 10:09 IST|Sakshi

సినీ రంగంలో 70 ఏళ్ల హీరోలు కూడా 20 ఏళ్ల హీరోయిన్లతో డ్యూయెట్లు పాడుతుంటారు. అయితే హీరోయిన్లకు 30 ఏళ్లు దాటినా, వివాహం చేసుకున్నా పక్కన పెట్టేస్తారు. ఆ తర్వాత వారికి అక్క, వదిన, అమ్మ పాత్రలు ఇస్తుంటారు. అయితే ఇటీవల ఆ పరిస్థితి మారిందని చెప్పాలి. 30 ఏళ్లు దాటినా, వివాహం చేసుకున్నా పాపులారిటీ కలిగిన హీరోయిన్లకు అవకాశాలు వస్తున్నాయి. నటి త్రిష ఈ కోవకు చెందినదే. ఈ చెన్నై బ్యూటీ నటిగానే 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2002 సంవత్సరంలో మౌనం పేసి యది చిత్రంలో సూర్యకు జంటగా హీరోయిన్‌గా పరిచయం అయింది.

ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ క్రేజీ కథానాయికగా రాణిస్తోంది. ఇటీవల ఈమె నటించిన పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలోని కుందవై పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం మలయాళంలో మోహన్‌లాల్‌కు జంటగా రామ్‌ అనే చిత్రంలో నటిస్తోంది. ఇక తమిళంలో త్రిష నటించిన గర్జనై, చతురంగ వేటై, రాంగీ చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి.

తాజాగా ది రోడ్‌ అనే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రంలో నటిస్తోంది. కాగా నటిగా రెండు శతాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా త్రిష తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపే విధంగా ‘ప్రియమైన త్రిషయర్స్‌ మనలో నేనూ ఒకరిగా ఉండగలగడం గర్వంగా ఉంది. మనకు ఎప్పటికీ కృతజ్ఞతలు. మన ఉన్నతికి మీరు చేసే అన్నింటికీ ధన్యవాదాలు’. అంటూ త్రిష తననూ అభిమానులతో కలుపుకుని ట్విట్టర్‌లో పేర్కొంది.
 

మరిన్ని వార్తలు