ఇక స్వారీ షురూ!

17 Nov, 2020 03:50 IST|Sakshi

‘ఈ పాత్ర చేయడం నీవల్ల అవుతుందా?’ అని సవాల్‌ విసిరే పాత్ర వచ్చినప్పుడు ఎంత రిస్క్‌ అయినా తీసుకోవడానికి వెనకాడని నటీనటులు ఉంటారు. తాజాగా త్రిష అలాంటి సవాల్‌నే స్వీకరించారు. ఈ పాత్ర కోసం గుర్రపు స్వారీ నేర్చుకోవడం త్రిష ముందు ఉన్న పెద్ద సవాల్‌. మణితర్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమాలోని రాణి కుందవై పాత్ర కోసమే ఆమె హార్స్‌ రైడింగ్‌ నేర్చుకోవాల్సి వచ్చింది. చెన్నైలోని ఓ హార్స్‌ రైడింగ్‌ స్కూల్‌లో గత నెల 26 నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టారు.

ఐదు రోజుల్లో ‘ఇంట్రో టు హార్స్‌ బ్యాక్‌ రైడింగ్‌’ కోర్స్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత స్వారీ చేయడానికి ఫౌండేషన్‌ కోర్స్‌ మొదలుపెట్టారు. ఈ నెల 3 నుంచి 14 వరకూ ఈ కోర్స్‌ని కూడా విజయవంతంగా పూర్తి చేశారామె. ‘సర్టిఫికెట్‌ కూడా వచ్చేసింది’ అని ఆనందం వ్యక్తం చేశారు త్రిష. ఇక ఈ సినిమా విశేషాలకు వస్తే.. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా రూపొందిస్తున్నారు. చోళ రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రేక్షకులు త్రిషను మరచిపోయి తెర మీద కుందవైనే చూస్తున్నట్లుగా భావించడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు. ఇందులో  విక్రమ్, కార్తీ, ఐశ్వర్యా రాయ్‌ తదితరులు నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు