పవన్‌కు త్రివిక్రమ్‌ మాట సాయం

16 Jan, 2021 11:35 IST|Sakshi

గతేడాది విడుదలైన అల వైకుంఠపురములో సినిమా బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ జోష్‌లో ఉన్నారు దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద నాన్‌ బాహుబలి కలెక్షన్లను కురిపించింది. ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌తో‌ సినిమా చేసేందుకు బిజీగా ఉన్నారు ఆయన. డైరెక్షన్‌తోపాటు మాటల రచయితగా త్రివిక్రమ్‌కు పెట్టింది పేరు. ఆయన రాసే డైలాగులు సినిమా విజయం సాధించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. త్రివిక్రమ్‌ మాటలు అంతా పవర్‌ఫుల్‌గా ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా పవన్‌ కల్యాణ్‌ నటించబోయే తదుపరి చిత్రానికి త్రివిక్రమ్‌ మాట సాయం చేయనున్నారు. మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని పవన్ కల్యాణ్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించే ఈ చిత్రంలో మరో హీరోగా రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నాడు. చదవండి: స్క్రిప్ట్‌ చదివే నిర్మాతలు ఇద్దరే అంటున్న త్రివిక్రమ్‌

వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న మల్టిస్టారర్‌ సినిమాకు త్రివిక్రమ్‌ స్క్రిన్‌ప్లే, డైలాగులు రాయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. సితార బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమాకు తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇక పవన్‌ సినిమాకు మాటల మాంత్రికుడు డైలాగులు అందించనుండటంతో అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. కాగా గతంలో పవన్‌ కల్యాణ్‌ నటించిన తీన్మార్‌ సినిమాకు కూడా త్రివిక్రమ్‌ మాటలు అందించిన విషయం తెలిసందే. ప్రస్తుతం పవన్‌ నటించిన వకీల్‌సాబ్‌ విడుదలకు సిద్ధంగా ఉండగా.. క్రిష్‌ దర్శకత్వంలో పీరియాడికల్‌ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాల అనంతరం రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. చదవండి: పవన్‌ కొత్త సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్‌..

మరిన్ని వార్తలు