పార్కింగ్‌ ఫీజు వసూలుకు ప్రభుత్వం అనుమతి

20 Jul, 2021 19:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  సినిమా థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు వసూలుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సింగిల్ స్క్రీన్ థియేటర్ల వద్ద యాజమాన్యం పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు జీవో నెం.63ను సవరించింది. అయితే మల్టీఫ్లెక్స్ లు, వ్యాపార వాణిజ్య సంస్థల్లో పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదని ప్రభుత్వం ఆదేశించింది. మల్టీఫ్లెక్స్ లకు గతంలో జారీ చేసిన ఉత్తర్వులే అమలవుతాయన్న ప్రభుత్వం..పార్కింగ్ ఫీజు ధరలను థియేటర్ యాజమాన్యాలకే వదిలేసింది.

గతంలో 2018లో కారుకు రూ.30, ద్విచక్రవాహనాలకు రూ. 20లను థియేటర్‌ యాజమాన్యాలు వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా ఉత్వర్వుల నేపథ్యంలో  గతంలో కంటే పార్కింగ్ ఫీజులు తగ్గిస్తామని థియేటర్ యాజమాన్యాల వెల్లడించాయి.  ఇక ఈ నెల 23నుంచి తెలంగాణలో థియేటర్లు తెరుచుకోనున్న సంగతి తెలిసిందే. వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవనున్నాయి.

కాగా, కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా దేశ వ్యాప్తంగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు సినిమాలు ఓటీటీని ఆశ్రయించాయి. అయితే నాగచైతన్య ‘లవ్‌స్టోరి’, నాని ‘టక్‌ జగదీష్‌’ సహా మరికొన్ని పెద్ద సినిమాలు మాత్రం థియేటర్‌ రిలీజ్‌ కోసం వేచి ఉన్నాయి. క్యూలో ఉన్న సినిమాలన్నీ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు