-

రామ్‌ గోపాల్‌ వర్మకు షోకాజ్‌ నోటీసులు

24 Nov, 2020 14:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మకు తెలంగాణ హైకోర్టు షోకాజు నోటీసులు అందించింది. దిశ ఎన్‌కౌంటర్‌ చిత్రంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, హత్య ఘటనపై రాంగోపాల్‌ వర్మ నిర్మిస్తున్న ‘దిశ ఎన్‌కౌంటర్‌’  చిత్రాన్ని నిలిపివేయాలని నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్‌కౌంటర్‌కు గురైన కుటుంబాలు ఇప్పటికే  తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయని, ఇలాంటి సమయంలో వర్మ ఈ చిత్రాన్ని నిర్మించి వారిని ఊరిలో కూడా ఉండన్వికుండా చేస్తున్నారని పిటిషినర్‌ తరపు న్యాయవాది కృష్ణ మూర్తి హైకోర్టుకు వివరించారు.

ఈ చిత్రంలో వారిని దోషులుగా చేసే ప్రయత్నం చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. చిత్రం విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరారు. దిశ సంఘటనపై ఒక పక్క జ్యుడిషినల్‌ కమిషన్‌ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సినిమా ఎలా తీస్తారని కోర్టుకు వివరించారు. వెంటనే చిత్రం విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. పిటిషినర్‌ తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు.. సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు ముంబై, బ్రాంచ్ ఆఫీస్ హైదరాబాద్, డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మ, సెక్రటరీ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్‌కు షోకాజు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

మరోవైపు దిశ ఎన్‌కౌంటర్ చిత్రం ఈ నెల 26న విడుదల చేసేందుకు వర్మ ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది నవంబర్ 26న షాద్ నగర్ సమీపంలో జరిగిన ఈ సామూహిక హత్యాచారాన్ని ఆధారంగా తీసుకొని దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదల చేశారు.

మరిన్ని వార్తలు