ఓ పార్టీలో చేదు అనుభవం, భయమేసి ఇంటికెళ్లి ఏడ్చాను: నవ్య స్వామి

27 May, 2021 15:36 IST|Sakshi

టీవీ నటి నవ్య స్వామి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. నా పేరు మీనాక్షి సీరియల్‌తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆ తర్వాత పలు సీరియళ్లలో ఆఫర్లు దక్కించుకొని ఫుల్‌ బిజీ ఆయిపోయింది. ఇక ఆమె కథ సీరియల్‌లో సహానటుడు రవి కృష్ణతో ప్రేమ వ్యవహరంపై వస్తున్న రూమర్లతో ఆమె మరింతగా పాపులర్‌ అయ్యింది. టీవీ షోల్లో, ఈవెంట్లల్లో జంటగా పాల్గొని వీరిద్దరి లవ్‌ ట్రాక్‌ని మరింత ఆసక్తిగా మలుస్తున్నారు. 

ఇటీవల కాలంలో బుల్లితెరపై ఏ షో చూసిన ఈ జంటే దర్శనమిస్తుంది. దీంతో ఇప్పుడు వీరి లవ్‌ ట్రాక్‌ సోషల్‌ మీడియాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరైన నవ్య స్వామి ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘మీరు ఓ పార్టీలో ఈవెంట్‌ మేనేజర్‌ను బాగా కొట్టారని తెలిసింది, ఎందుకని హోస్ట్‌ అడగ్గా దానిపై ఆమె వివరణ ఇచ్చింది. ‘ఒకసారి ఫ్రెండ్స్ అందరితో కలిసి పార్టీకి వెళ్లాను. అక్కడ మేమంతా డ్యాన్సులు వేస్తూ పార్టీ చేసుకుంటున్నాం. అలా గుంపుగా ఉండి రచ్చ రచ్చ చేస్తున్నాం. ఈ క్రమంలో మధ్యలో ఆ ఈవెంట్‌ మేనేజర్ వచ్చి నన్ను అసభ్యకరంగా తాకాడు.

దీంతో వెంటనే వెనక్కి తిరిగి వాడిని తోసేసి చితక్కొట్టాను. ఆ తర్వాత కాళ్లతో తన్నుతూ.. చేతులతో కొట్టేశాను. బతికాడో, చచ్చాడో కూడా తెలియదు. కానీ నేను కొట్టిన కొట్టుడుకు నా చేతి వేళ్లు వాచిపోయాయి. ఇక ఆ ఘటనతో నాకు ఎంతో భయం వేసింది. ఇంటికి వెళ్లి ఏడ్చేశాను. తెలియని వారు మనల్ని అలా తాకితే ఎలా ఉంటుంది’  అంటునవ్యస్వామి అసలు విషయం చెప్పుకొచ్చింది. అయితే సినిమాల్లో కనిపించాలన్నది తన కోరిక అని, ఇప్పుడు అయితే సీరియళ్లతోనే బిజీగా ఉన్నానని చెప్పింది. ప్రస్తుతం సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయని, కానీ దానికి ఇంకా సమయం ఉందని ఆమె పేర్కొంది. 

మరిన్ని వార్తలు