బ్రేకప్‌ చెప్పుకున్న బుల్లితెర జంట, మళ్లీ కలిసే ప్రసక్తే లేదంటూ..

18 May, 2023 16:37 IST|Sakshi

బుల్లితెర జంట జీషన్‌ ఖాన్‌, రేహ్న పండిత్‌(రేహ్న మల్హోత్రా) విడిపోయారంటూ గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా అదే నిజమైంది. తమ మధ్య ప్రేమబంధం ముగిసిందని నటి రేహ్న వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. 'జీషన్‌తో నా ప్రయాణం ముగిసింది. మేమిద్దరం కలిసి ఉండట్లేదు. మళ్లీ కలవాలన్న ఆలోచన కూడా లేదు. గతకొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరదించాలనుకున్నాను. అందుకే ఈ విషయం చెప్తున్నా.

ఇక మీదట జీషన్‌ గురించి నన్ను ఎటువంటి ప్రశ్న అడగకండి. ఎందుకంటే అంతా అయిపోయింది. ఇక్కడితో దీన్ని వదిలేయండి' అని చెప్పుకొచ్చింది. అటు జీషన్‌ కూడా 'అవును, బ్రేకప్‌ చెప్పుకున్నాం. ఇక మీదట దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. నా వైపు నుంచి చివరిసారిగా రేహ్నకు వీడ్కోలు చెబుతున్నా' అని తెలిపాడు. కాగా జీషన్‌, రేహ్న కుంకుమ్‌ భాగ్య సీరియల్‌ సెట్‌లో కలిశారు. అప్పటినుంచే ప్రేమలో ఉన్నారు. 2021 అక్టోబర్‌లో తమ ప్రేమను అధికారికంగా వెల్లడించారు.

జీషన్‌ కన్నా రేహ్న వయసులో పెద్దదైనప్పటికీ ఎప్పుడూ తమ మధ్య పొరపచ్చాలు రాలేదని వీరు గతంలో చెప్పుకొచ్చారు. ఏమైందో ఏమో కానీ సడన్‌గా గత నెలలో రేహ్నాతో బ్రేకప్‌ అయిందని పోస్ట్‌ పెట్టాడు జీషన్‌. మళ్లీ ఆ వెంటనే.. అలాంటిదేమీ లేదని కలిసిపోయామని క్లారిటీ ఇచ్చారు. కాకపోతే కొన్ని గొడవలు జరిగాయని, ఇద్దరం వాటి నుంచి బయటపడి ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసిపోవడానికి సమయం పట్టిందన్నారు. ఒక్కసారి ప్రేమించాక జీవితాంతం తన చేయి వదలనని చెప్పాడు జీషన్‌. గొడవలకు ముగింపు పలికి మళ్లీ కలిసిపోయారనుకుంటున్న సమయంలో శాశ్వతంగా విడిపోతున్నట్లు వెల్లడించి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది జంట.

చదవండి: రష్మికను నేనేమీ అనలేదు: ఐశ్వర్య రాజేశ్‌

మరిన్ని వార్తలు