ట్విట్టర్‌ ఇండియా టాప్‌ 10 జాబితా

15 Dec, 2020 00:23 IST|Sakshi

స్టార్స్‌ తాజా చిత్రాల అప్‌డేట్స్, హాలిడేస్, ఇంకా ఇతర విశేషాల గురించి తెలుసుకోవాలని అభిమానులు అనుకుంటారు. అందుకే ఏదైనా అప్‌డేట్‌ దొరుకుతుందేమోనని సోషల్‌ మీడియాలో వెతుకుతారు. ఎంత బాగా వెతికితే ట్విట్టర్‌లో అంత ట్రెండ్‌ అవుతుంటారు స్టార్స్‌. అలాగే ఎవరి గురించి అయితే ఎక్కువగా ట్వీట్స్‌ పడతాయనేదాన్ని బట్టి ట్విట్టర్‌లో వారి స్థానం ఉంటుంది. ‘2020లో ఎక్కువగా ట్వీట్‌ చేయబడిన దక్షిణ భారత స్టార్స్‌ వీరే అంటూ  ‘ట్విట్టర్‌ ఇండియా’ టాప్‌ 10 జాబితాను విడుదల చేసింది.

దక్షిణాదిన ఎక్కువగా ట్వీట్‌ చేయబడిన స్టార్‌గా మహేశ్‌బాబు నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచారు. మహేశ్‌ తాజా సినిమాల అప్‌డేట్స్, భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో హాలిడే ట్రిప్స్‌ విశేషాలకు చాలా క్రేజ్‌ ఉంటుంది. ఇవే మహేశ్‌ నంబర్‌ వన్‌ స్థానానికి కారణం అని చెప్పొచ్చు. ఆ తర్వాతి స్థానం పవన్‌ కల్యాణ్‌ది. కొంత గ్యాప్‌ తర్వాత పవన్‌ చేస్తున్న చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. ఈ సినిమా విశేషాల కోసం అభిమానులు భారీగానే ట్వీట్స్‌ చేశారు. ఇక తమిళ మాస్‌ హీరో విజయ్‌కి సూపర్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. పైగా విజయ్‌ రాజకీయ రంగప్రవేశం గురించిన వార్తలు ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంటాయి. సౌత్‌లో మూడో స్థానం విజయ్‌ది.

ప్రతిష్టాత్మక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం చేస్తున్న ఎన్టీఆర్‌ నాలుగో స్థానం దక్కించుకున్నారు. ఇటీవల సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’కి లభించిన ఆదరణ, ఆ క్రమంలో ప్రముఖులు చేసిన ట్వీట్లు సూర్యని ఐదో ప్లేస్‌లో నిలబెట్టాయి. ‘పుష్ప’లో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించబోతున్న అల్లు అర్జున్‌ ఆరవ స్థానంలో, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో నటించడంతో పాటు ‘ఆచార్య’లో కీలక పాత్ర చేస్తున్న రామ్‌చరణ్‌ ఏడో స్థానంలో, ‘వై దిస్‌ కొలవెరి..’, ‘రౌడీ బేబీ’ వంటి పాటలతో పాటు మంచి మాస్‌ క్యారెక్టర్స్‌తో దూసుకెళుతున్న ధనుశ్‌ ఎనిమిదో స్థానంలో, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ తొమ్మిది, తెలుగు మెగాస్టార్‌ చిరంజీవి పదో స్థానంలో నిలిచారు.

కథానాయికల్లో అగ్రస్థానం ‘మహానటి’ కీర్తీ సురేశ్‌ది. లాక్‌డౌన్‌లో కీర్తీ సురేశ్‌వి ‘పెంగ్విన్‌’, ‘మిస్‌ ఇండియా’ సినిమాలు విడుదలయ్యాయి. అలాగే తాను చేస్తున్న సినిమాల అప్‌డేట్స్‌తో ట్రెండ్‌ అయ్యారు. రెండో స్థానంలో కాజల్‌ అగర్వాల్‌ నిలవడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. కాజల్‌ పెళ్లి సందడి ట్విట్టర్‌లో హల్‌చల్‌ చేసింది. అలాగే తన భర్త గౌతమ్‌తో మాల్దీవులకు వెళ్లి, ఆ ఫొటోలను షేర్‌ చేయడం కాజల్‌ని ట్రెండింగ్‌లో ఉంచింది. సమంత సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆమె ఫాలోయర్స్‌ కూడా అంతే. ఈ బ్యూటీది మూడో స్థానం. రష్మికా మందన్నా నాలుగు, పూజా హెగ్డే ఐదు, తాప్సీ ఆరు, తమన్నా ఏడు, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఎనిమిది, శ్రుతీహాసన్‌ తొమ్మిది, త్రిష పదో స్థానం దక్కించుకున్నారు.
 

మరిన్ని వార్తలు