‘చిత్రం’ మూవీకి ఉదయ్‌ కిరణ్‌ పారితోషికం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

9 Jul, 2021 19:30 IST|Sakshi

Uday Kiran First Remuneration: దివంగత నటుడు ఉదయ్‌ కిరణ్‌ వెండితెరకు హీరోగా పరిచయమైన సినిమా ‘చిత్రం’. తేజ దర్శకత్వంలో తెరకెక్కిచిన ఈ మూవీతో ఉదయ్‌ తొలి సక్సెస్‌ అందుకున్నాడు. ఆ తర్వాత వెంట వెంటనే నువ్వు-నేను, కలుసుకోవాలని వంటి లవ్‌స్టోరీల్లో నటించి హ్యాట్రిక్‌ కొట్టాడు. అంతేకాదు ఈ చిత్రాలతో లవర్‌ బాయ్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎదిగిన ఉదయ్‌కిరణ్‌ ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండానే స్టార్‌ హీరో హోదా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి హిట్‌లు, ప్లాప్‌లు అందుకున్న అతడి జీవితం చివరకు విషాదంగా ముగిసింది. 2014లో అతడు ఆత్మహత్య చేసుకుని తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా తొలి సనిమాతోనే ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న ‘చిత్రం’ మూవీకి ఉదయ్‌ తీసుకున్న రెమ్యునరేషన్‌ ఎంతో తెలిస్తే అందరూ షాక్‌ అవ్వాల్సింది. ఉషా కిరణ్‌ మూవీస్‌లో రామోజీరావు తెరకెక్కించిన ఈ మూవీ 42 లక్షల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారట. 30 రోజుల్లోనే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ సంచలన విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద దూసుకుపోతూ 8 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. అంతగా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టిన ఈ ‘చిత్రం’ మూవీకి ఉదయ్‌ కిరణ్‌ కేవలం 11 వేల రూపాయల పారితోషికం మాత్రమే తీసుకున్నాడట. అంతేగాక ఈ మూవీకి పని చేసిన డైరెక్టర్‌ తేజ, సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్‌లు సైతం అతి తక్కవ రెమ్యునరేషన్‌ను తీసుకోవడం గమనార్హం. 

అయితే ఈ మూవీలో మొదట హీరోగా మరో వ్యక్తిని ఫైనల్‌ చేసి హీరో స్నేహితుడి పాత్రలో ఉదయ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఉన్నాడట. అయితే సినిమా షూటింగ్‌ మొదలయ్యే ముందు హీరోగా చేయాల్సిన ఆ వ్యక్తి చివరకు హ్యాండ్‌ ఇవ్వడంతో తేజ ఉదయ్‌ కిరణ్‌ను హీరోగా పెట్టి ‘చిత్రం’ మూవీ రూపొందించి టాలీవుడ్‌కు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందించాడు. మరో విషయం ఎంటంటే ఈ మూవీ తర్వాత తేజ తీసిన నువ్వు-నేను సినిమాకు కూడా మొదట ఉదయ్‌ను అనుకోలేదట. హీరో మాధవన్‌తో ఈ మూవీ చేద్దామనుకున్నాడట. అప్పటికే మాధవన్‌ తెలుగు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో మళ్లీ ఉదయ్‌ కిరణ్‌ను హీరోగా తీసుకుని ఈ ‘నువ్వు-నేను’ మూవీని తెరకెక్కించాడు. లవ్‌ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం కూడా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు