Tollywood Movies: ఈ ఏడాది టాలీవుడ్‌లో ప్రేమకథా చిత్రాలు ఇవే..!

14 Feb, 2023 13:24 IST|Sakshi

సినిమాల్లో ప్రేమకథలకు ఉన్న క్రేజే వేరు. లవ్ స్టోరీలను సినీ ప్రేమికులు ఎక్కువగా ఇష్టపడతారు. భాష ఏదైనా ప్రేమకథా చిత్రాలకు ఆదరణ ఉంటుంది. గతేడాదిలో పలు ప్రేమ కథాంశంగా తెరకెక్కిన చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా కూడా నిలిచాయి. అందులో సీతారామం మూవీ ఒకటి. మరీ ఈ ఏడాది కూడా ప్రేక్షకులను అలరించేందుకు మరిన్ని చిత్రాలు సిద్ధమయ్యాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా సరికొత్త ప్రేమకథలను పరిచయం చేసేందుకు టాలీవుడ్‌లో సిద్ధమవుతున్న చిత్రాలేవో చూసేద్దాం. 

ప్రేమకావ్యం.. శాకుంతలం

కాళిదాసు రచించిన ప్రేమకావ్యం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపొందిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్‌ మోహన్, శకుంతలగా సమంత నటించారు. మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, గౌతమి, మధుబాల కీలక పాత్రలుపో షించారు. కాగా ఏప్రిల్‌ 14న ‘శాకుంతలం’ని విడుదల చేయనున్నట్లు శుక్రవారం కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. 

వినరో భాగ్యము విష్ణుకథ

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి నటిస్తున్న చిత్రం 'వినరో భాగ్యము విష్ణుకథ'. సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫోన్‌ నంబర్‌ ప్రధాన అంశంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. మన ఫోన్‌ నెంబర్ తర్వాత నెంబర్ వారితో పరిచయం ప్రేమగా మారితే ఎలా ఉంటుందన్నదే ప్రధాన కథాంశం. ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

నాని- కీర్తి సురేశ్ 'దసరా' 

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దసరా. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది.  యాక్షన్‌ చిత్రంగా తెరకెస్తున్నప్పటికీ ఓ మంచి ప్రేమకథ ఉందని పోస్టర్లు చూస్తే అర్థమవుతోంది.  ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి.ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే  ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది.  సింగరేణి బొగ్గు గనుల సమీపంలోని వీర్లపల్లి గ్రామ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ధరణిగా నాని, వెన్నెలగా కీర్తిసురేశ్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

విజయ్ - సమంత 'ఖుషి'

పవన్‌ కల్యాణ్‌, భూమిక జంటగా నటించిన ఖుషి ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే పేరుతో రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. మజిలీ డైరెక్టర్‌ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కశ్మీర్‌ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కొంతభాగం షూటింగ్‌ కూడా పూర్తయ్యింది. దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

మరిన్ని వార్తలు