విడుదలకు సిద్ధమైన తమిళ సినిమా 'పెరోల్‌'

10 Nov, 2022 12:04 IST|Sakshi

తమిళసినిమా: ట్రిపుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మధుసూదన్‌ నిర్మిస్తున్న చిత్రం పెరోల్‌. ద్వారకా రాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆర్‌ఎస్‌ కార్తీక్, లింగ, కల్పిక, మనీషా మురళి, వినోదిని, వైద్యనాథన్, జానకి సురేష్‌, మైక్‌ మణి, శివం, డేనియల్‌ ఇమానువేల్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్‌కుమార్‌ అమల్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వివరాలు తెలుపుతూ నిర్మాత తనపై నమ్మకం ఉంచి చిత్రాన్ని తెరకెక్కించడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారన్నారు.

ఇది కుటుంబ నేపథ్యంలో మనం చూడని కోణాన్ని ఆవిష్కరించే విభిన్న కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో నటీనటులు పూర్తి అంకితభావంతో నటించారని చెప్పారు. ఇందులో పురుషులు కలిగించే సమస్యలను స్త్రీలు పరిష్కరిస్తారన్నారు. ఇందులో నటించిన నటీమణులు ఆ భావోద్వేగాలను చక్కగా ప్రతిఫలింపజేశారన్నారు. చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన ఆర్‌ఎస్‌ కార్తీక్‌ మాట్లాడుతూ ఈ చిత్రం ఒక తల్లికి ఇద్దరు కొడుకుల మధ్య జరిగే కథ అని తెలిపారు.

ఇది నార్త్‌ చెన్నై నేపథ్యంలో సాగే కథా చిత్రం అని చెప్పారు. నార్త్‌ చెన్నై నేపథ్యంలో సాగే కథలు బలంగా ఉంటాయన్నారు. అలా ఇందులోని పాత్రలన్నీ ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంటాయన్నారు. ఇలాంటి చిత్రాలు విజయం సాధిస్తే మరిన్ని మంచి కథా చిత్రాలు వస్తాయన్నారు. నాలాంటి నవ సంగీత దర్శకులకు ఇది డ్రీమ్‌ చిత్రమని రాజ్‌కుమార్‌ అమల్‌ పేర్కొన్నారు. దీనికి పని చేయటం చాలా మంచి అనుభవంగా పేర్కొన్నారు. తన ప్రతిభను చాటుకోవడానికి మంచి స్కోప్‌గా ఉన్న చిత్రం పెరోల్‌ అని అన్నారు.

మరిన్ని వార్తలు