అక్కినేని హీరోతో 'ఉప్పెన' దర్శకుడి సినిమా

25 Feb, 2021 15:25 IST|Sakshi

కరోనా భయాన్ని ఉప్పెనలా తరిమి కొట్టాడు బుచ్చిబాబు సానా. లాక్‌డౌన్‌ తర్వాత సగటు ప్రేక్షకుడు కరోనా భయంతో థియేటర్‌కు వస్తాడో లేదోనన్న అనుమానాలను ఆయన తన సినిమాతో పటాపంచలు చేశాడు. కథ బాగుంటే కనీస జాగ్రత్తలు పాటించైనా బొమ్మ చూసేందుకు థియేటర్‌కు పరుగెత్తుకుంటూ వస్తారని ఉప్పెన నిరూపించింది. 

అప్పటివరకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న బుచ్చిబాబు సానా తన తొలి చిత్రంతోనే హిట్‌ డైరెక్టర్‌గా మారిపోయాడు. తనకు భారీ సక్సెస్‌ను తెచ్చిపెట్టిన మైత్రీమూవీ మేకర్స్‌ బ్యానర్‌లోనే మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. అయితే బుచ్చిబాబు రెండో సినిమా ఎవరితో చేస్తారనేది టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరంగా మారింది. అప్పట్లో ఈయన రెండో చిత్రం జూనియర్‌ ఎన్టీఆర్‌తో అన్న టాక్‌ వినిపించినప్పటికీ తాజాగా అక్కినేని హీరో నాగచైతన్య పేరు వినిపిస్తోంది.

ఈ మేరకు ఆయనకు కథ వినిపించాడని, అది నచ్చిన చైతూ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం నాగ చైతన్య, సాయిపల్లవితో కలిసి లవ్‌స్టోరీలో నటిస్తున్నాడు. ఇందులో చై, సాయి పల్లవి తెలంగాణ యాసలో సంభాషణలు చెప్తారట. ఏప్రిల్‌ 16న ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు విక్రమ్‌ కుమార్‌ డైరెక్షన్‌లో థ్యాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు.

చదవండి: ఓటీటీలోకి ఉప్పెన.. రూ.7 కోట్లకు కొనుగోలు

ముంబైలో కాస్ట్‌లీ ఫ్లాట్‌ కొన్న రష్మిక!

మరిన్ని వార్తలు