Mythri Movies: ఉప్పెన దర్శకుడికి బంపరాఫర్‌!

17 Feb, 2021 15:17 IST|Sakshi

కంటెంట్‌ బాగుంటే చాలు, కొత్త, పాత, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సినిమాను ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. ఈ క్రమంలో మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా వచ్చిన "ఉప్పెన" చిత్రం బాక్సాఫీస్‌ మీద దాడి చేసి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తన ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా తీసిన ఈ చిత్రం రూ.100 కోట్ల మార్క్‌ అందుకుంటుందని దర్శకుడు సుకుమార్‌ గతంలోనే చెప్పాడు. ఇప్పటికైతే హాఫ్‌ సెంచరీని అవలీలగా దాటేయగా, ఈ సినిమా చాలా బాగుందంటూ పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదిలా వుంటే 'డియర్‌ కామ్రేడ్‌', 'సవ్యసాచి' సినిమాలతో నిండా మునిగిన మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ను ఉప్పెన సునామీలా వచ్చి ఆదుకుంది. ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని పూడ్చుతూ లాభాల బాట పట్టించింది. దీంతో మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి.. దర్శకుడు సానా బుచ్చిబాబుకు ప్రత్యేక బహుమతిచ్చేందుకు రెడీ అయ్యారట. ఇల్లు లేదా కారులో ఏది కావాలో కోరుకోమని బుచ్చిబాబును అడిగినట్లు సమాచారం. అయితే ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్‌కు ఆ రెండూ ఇచ్చినా తప్పు లేదని అంటున్నారు. కాగా మంచి విజయాలు నమోదు చేసుకున్న ఛలో, ప్రతిరోజు పండగే సినిమాలకుగానూ దర్శకులు వెంకీ, మారుతిలకు కార్లు బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం పది సినిమాలను నిర్మిస్తూ టాలీవుడ్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ బిజీబిజీగా మారింది. సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో ఓ సినిమా చెయ్యనున్నారు. నేచురల్ స్టార్ నాని – వివేక్ ఆత్రేయతో ‘అంటే సుందరానికి’ అనే సినిమా చేస్తున్నారు.

అలాగే నందమూరి కళ్యాణ్ రామ్‌తో చేస్తున్న సినిమా ఇటీవలే ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్, నటసింహా నందమూరి బాలకృష్ణ – గోపిచంద్ మలినేని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్, విజయ్ దేవరకొండ – శివ నిర్వాణ, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్‌తో ఓ పాన్ ఇండియా సినిమా ప్లాన్‌ చేస్తున్నారు. బుచ్చిబాబు సానా తన తర్వాతి‌ రెండు సినిమాలు కూడా మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లోనే చేయనున్నట్లు సమాచారం.

చదవండి: ‘నాలోకి నన్ను అన్వేషించుకునేలా చేసిన సా‘నా’బుచ్చిబాబు’

మా ఊళ్లో నన్ను సుకుమార్‌ అని పిలుస్తారు!

మరిన్ని వార్తలు