ఈ హిట్‌తో తెలుగు సినిమాకి ప్రాణం పోశారు 

17 Feb, 2021 23:27 IST|Sakshi
నవీన్, దేవిశ్రీ, రవిశంకర్, బుచ్చిబాబు, వైష్ణవ్‌ తేజ్, రామ్‌చరణ్, కృతి, మార్గాని భరత్‌ 

‘‘కరోనా నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ పూర్తి స్థాయిలో దెబ్బతింది. ఈ సమయంలో ‘ఉప్పెన’ సినిమాని హిట్‌ చేయడం ద్వారా తెలుగు సినిమాకు ప్రేక్షకులు ప్రాణం పోశారు’’ అన్నారు రామ్‌చరణ్‌. పంజా వైష్ణవ్‌ తేజ్, కృతీ శెట్టి జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజైంది. రాజమహేంద్రవరంలో బుధవారం ఉప్పెన విజయోత్సవం జరిగింది. ఈ వేడుకలో రామ్‌చరణ్‌ మాట్లాడుతూ– ‘‘తెలుగుతో పాటు ఇతర భాషల్లోని సినిమాలకు కూడా ‘ఉప్పెన’ హిట్‌ ఓ ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. వైష్ణవ్‌ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గురువును (సుకుమార్‌) మించిన శిష్యుడు అని బుచ్చిబాబు నిరూపించుకున్నాడు’’ అన్నారు. ‘‘మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు వైష్ణవ్‌ తేజ్‌. ఈ వేడుకలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు